PoK : పాకిస్తాన్ అక్రమ ఆధీనంలో ఉన్న కాశ్మీర్ (PoK) లో తిరుగుబాటు జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ‘ఆజాద్ కాశ్మీర్’ అంటూ దశాబ్దాలుగా అంతర్జాతీయ సమాజం ముందు షాబాజ్ షరీఫ్ ప్రభుత్వం, పాక్ సైన్యం ప్రచారం చేస్తున్న అబద్ధాల ముసుగును స్థానిక ప్రజలే బద్దలు కొట్టారు. పీఓకేలోని రావల్‌కోట్ నగరంలో జరిగిన ఒక భారీ బహిరంగ సభలో జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) కీలక నాయకుడు సర్దార్ అమన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఇది స్వతంత్ర లేదా వివాదాస్పద ప్రాంతం కాదు.. పాకిస్తాన్ బలవంతంగా లాక్కుని, బానిసత్వంలో ఉంచిన ఆక్రమిత భూభాగం” అని ఆయన వేలాది మంది సమక్షంలో గర్జించారు. శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న స్థానికులపై పాక్ భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఒక స్థానిక క్రికెటర్‌తో సహా ఆరుగురు అమాయకులు మరణించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తీవ్ర స్థాయికి చేరాయి.

పాకిస్తాన్ దశాబ్దాలుగా ప్రపంచ దేశాల ముందు కాశ్మీర్ విషయంలో ఆడుతున్న కపట నాటకం ఇప్పుడు పీఓకేలోనే బట్టబయలైంది. రావల్‌కోట్ నగరంలోని ఈద్గా మైదానంలో సుమారు 80 వేల మందికి పైగా హాజరైన భారీ ర్యాలీలో సర్దార్ అమన్ ఖాన్ మైక్ అందుకుని పాక్ పాలకులకు నేరుగా సవాల్ విసిరారు. ఇక్కడి ప్రజలు పూర్తిగా బానిసత్వంలో మగ్గిపోతున్నారని, తాము పాక్ పాలనను అంగీకరించబోమని ఆయన ప్రకటించినప్పుడు సభకు వచ్చిన వేలాది మంది ప్రజలు చప్పట్లతో తమ మద్దతును పలికారు. పాక్ సైన్యాధిపతి జనరల్ ఆసిమ్ మునీర్ బలగాలు ఎంతగా అణచివేయాలని చూస్తున్నా, అక్కడి నిరసన జ్వాలలు అంతకంతకూ తీవ్రమవుతున్నాయి.

ఈ చారిత్రాత్మక పోరాటంలో భాగంగా, పాకిస్తాన్ దౌర్జన్యాలను ఎదిరించడానికి ఉద్యమకారులు ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. తుపాకీ గుళ్లకు సైతం ఎదురొడ్డి నిలిచే అజేయమైన వీరులుగా ఇప్పుడు మహిళలు,పిల్లలు ఈ ఉద్యమంలోకి ప్రవేశించారు. పాక్ సైన్యం, పోలీసుల దారుణాలను దీటుగా ఎదుర్కోవడానికి జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) ఒక వ్యూహాత్మక అడుగు వేసింది. ఉద్యమానికి మరింత బలాన్ని చేకూర్చడానికి ప్రతి ఇల్లు దాటి మహిళలు, పిల్లలు సైతం రోడ్లపైకి వచ్చి పోరాడాలని జేఏఏసీ పిలుపునిచ్చింది.

Also Read : బలూచిస్తాన్ విలీనం వెనుక ఉన్న ఆసక్తికరమైన కథ, ప్రస్తుత పరిణామాలు

సమాజంలోని అన్ని వర్గాలూ ఏకమై వీధుల్లోకి వస్తేనే ఇస్లామాబాద్‌లో నిద్రపోతున్న అంధ, మూగ ప్రభుత్వానికి ప్రజల ఆర్తనాదాలు వినిపిస్తాయని ఉద్యమ నేతలు అభిప్రాయపడుతున్నారు. మహిళలు, పిల్లలు కూడా ఈ మహా నిరసనల్లో భాగస్వాములు కావాలనే పిలుపుతో పాకిస్తాన్ భద్రతా బలగాల్లో వణుకు మొదలైంది. ఎందుకంటే ఈ పోరాటం ఇప్పుడు కేవలం కొద్దిమంది నిరసనకారులది మాత్రమే కాకుండా, ప్రతి కాశ్మీరీ కుటుంబానికి సంబంధించిన మనుగడ పోరాటంగా మారిపోయింది.

మరోవైపు, పీఓకేలో హక్కుల కోసం శాంతియుత మార్గంలో అడిగితే పాక్ ప్రభుత్వం బుల్లెట్లతో సమాధానం ఇస్తోందని అనడానికి రావల్‌కోట్ ఘటనలే నిదర్శనం. రావల్‌కోట్ నగరంలోని న్యూ బస్ టెర్మినల్ సమీపంలో తమ న్యాయమైన డిమాండ్ల కోసం ప్రజలు నిరసన తెలుపుతుండగా పాక్ రక్షణ దళాలు విచక్షణారహితంగా విరుచుకుపడ్డాయి. జనాన్ని చెదరగొట్టే నెపంతో నేరుగా జరిపిన కాల్పుల్లో ఆరుగురు సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

ఈ దారుణ కాల్పుల్లో మరణించిన వారిని జాహిద్ మొఘల్, జాఫర్ మొఘల్, అర్సలాన్ అక్బర్, వాజిద్ హయాత్‌లుగా గుర్తించారు. మృతుల్లో ఒకరైన వాజిద్ హయాత్ ఆ ప్రాంతంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్థానిక క్రికెటర్ కావడం గమనార్హం. ఆయన మరణవార్త తెలుసుకున్న స్థానిక ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. శాంతియుతంగా ఉండే పర్వత ప్రాంతాలను పాక్ బలగాల హత్యాకాండ ఒక్కసారిగా అల్లకల్లోలంగా మార్చివేసింది. ఈ ఘటనతో పాకిస్తాన్ నుండి విడిపోవాలనే పీఓకే ప్రజల ఆకాంక్ష మరింత బలీయంగా మారుతోంది.

Also Read : గ్రీన్ సిమెంట్ అంటే ఏమిటి? ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో నూతన అధ్యాయం!

MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.