
Lashkar Commander : జమ్మూకశ్మీర్లో భద్రతా బలగాలు ఉగ్రవాదులపై మరోసారి విరుచుకుపడ్డాయి. కశ్మీర్లోని బుద్గామ్ జిల్లా యూస్మార్గ్ ఎగువ ప్రాంతాల్లో జరిగిన ఎన్కౌంటర్లో పాకిస్థాన్కు చెందిన లష్కర్-ఏ-తయిబా కమాండర్ యాసిర్ హతమైనట్లు భద్రతా వర్గాలు తెలిపాయి. ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలపై నిఘా వర్గాల నుంచి సమాచారం అందడంతో భద్రతా బలగాలు ఇంటెలిజెన్స్ ఆధారంగా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. గాలింపు సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో యాసిర్ హతమైనట్లు సమాచారం.
Also Read : పాకిస్థాన్కు బిగ్ షాక్.. ఇండస్పై భారత్ తొలి చెక్డ్యామ్!
యాసిర్ గతంలో లష్కర్-ఏ-తయిబాకు చెందిన సులేమాన్ మూసా గ్రూపులో పనిచేసినట్లు భద్రతా వర్గాలు తెలిపాయి. అయితే ఏడాది క్రితం ఆ గ్రూపు నుంచి విడిపోయి అప్పటి నుంచి విడిగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు వెల్లడించాయి. కొంతకాలంగా యూస్మార్గ్ ప్రాంతంలో అతడి కదలికలపై భద్రతా సంస్థలు నిఘా పెట్టినట్లు సమాచారం. గ్రూపు నుంచి విడిపోయిన తర్వాత యాసిర్ ఆ ప్రాంతంలో కీలక లష్కర్ ఆపరేటివ్గా ఎదిగినట్లు అధికారులు భావిస్తున్నారు. యూస్మార్గ్ ఎగువ ప్రాంతాల్లో అతడి ఉనికిపై సమాచారం రావడంతో భద్రతా బలగాలు ప్రత్యేకంగా గాలింపు చేపట్టాయి. అదే సమయంలో ఎదురుకాల్పులు జరిగి అతడు హతమయ్యాడు.
యాసిర్ హతంతో అతడి నెట్వర్క్పై భద్రతా సంస్థలు దృష్టి పెట్టాయి. ఇతర లష్కర్ ఉగ్రవాదులతో అతడికి ఉన్న సంబంధాలు, కశ్మీర్లో అతడు నిర్వహించిన కార్యకలాపాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఉగ్రవాద ఘటనలకు సంబంధించి అతడికి ఏమైనా పాత్ర ఉందా? వాటికి ప్రణాళిక, సహకారం లేదా ఇతర విధాలుగా మద్దతు అందించాడా? అనే కోణాల్లోనూ అధికారులు విచారణ జరుపుతున్నారు.
లష్కర్-ఏ-తయిబాకు చెందిన సులేమాన్ మూసా అలియాస్ హషీమ్ మూసా.. 2025లో పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి ప్రధాన సూత్రధారుల్లో ఒకడు. ఆ దాడి జరిగిన కొన్ని నెలల తర్వాత శ్రీనగర్లోని దాచిగామ్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలతో జరిగిన ఎన్కౌంటర్లో సులేమాన్ మూసా హతమయ్యాడు. యాసిర్ కూడా అతడి గ్రూపులో పనిచేసినట్లు సమాచారం. ప్రస్తుతం యాసిర్ నెట్వర్క్, అతడి సంబంధాలు, ఇటీవలి ఉగ్ర కార్యకలాపాల్లో అతడి పాత్రపై భద్రతా సంస్థలు దర్యాప్తు కొనసాగిస్తున్నాయి.
Also Read : దక్షిణాఫ్రికా మొత్తాన్ని ఫొటో తీసే కెపాసిటీ.. శత్రువుల దాడులను పసిగట్టే శక్తి.. GSLV-F17 ప్రత్యేకతలివే!









