భారతదేశం మొత్తం నిద్రపోతున్న వేళ ఏపీలోని శ్రీహరికోటలో ఇస్రో(ISRO) శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, సిబ్బంది మొత్తం 16,500 మందికి పైగా కష్టపడి గొప్ప విజయాన్ని సాధించారు. GSLV-F17 రాకెట్ EOS-05 భూ పరిశీలన ఉపగ్రహాన్ని విజయవంతంగా అంతరిక్షంలోకి పంపించారు. ఇస్రోకు దీర్ఘకాలంగా వెన్నెముకగా ఉన్న PSLV రాకెట్ 2025, 2026 జనవరిలో వరుస వైఫల్యాలను చవిచూసింది. ఈ ఎదురుదెబ్బలు ఇస్రోను మళ్లీ ఒక దారిలోకి వచ్చేలా నిలబెట్టాయి. ఈ వైఫల్యాలతో PSLV రాకెట్ల సముదాయం పూర్తిగా నిలిపివేయడంతో GSLV Mk II పైకి భారం పడింది.

Also Read : నేడే కృష్ణాష్టమి.. ఇలా పూజ చేసి నైవేద్యం పెడితే.. అష్టైశ్వర్యాలు అన్ని మీ ఇంట్లోనే!

GSLV Mk II ను మొత్తం 19 సార్లు ప్రయోగాలు చేయగా.. ఆరుసార్లు విఫలమైంది. అయితే సాధారణంగా అంతరిక్ష పరిశోధనలు అనగానే ఉపగ్రహాలు భూమి చుట్టూ తిరగడం మనకు తెలుసు. కానీ భూమికి దాదాపు 36,000 కిలోమీటర్ల ఎత్తులో ఒకే చోట నిలబడి భూగ్రహంపై జరిగే ప్రతి చిన్న మార్పును ప్రతీ సెకను పర్యవేక్షించే ‘అంతరిక్ష కన్ను’ను భారత్ సొంతం చేసుకుంది. అసలు ఏంటి ఈ ప్రయోగం?

భారతదేశ సుదీర్ఘమైన సరిహద్దులు, సముద్ర తీరప్రాంతాలు, తరచూ వచ్చే తుఫానుల నుంచి దేశాన్ని కాపాడుకోవడానికి ఒక నిరంతర నిఘా వ్యవస్థ అవసరమని ఇస్రో గతంలో గుర్తించింది. ఈ ఆలోచన నుంచే జియో ఇమేజింగ్ శాటిలైట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. సాధారణంగా మన వాతావరణం, భూమి పరిశీలన ఉపగ్రహాలు భూమికి కేవలం 500 నుంచి 800 కిలోమీటర్ల ఎత్తులో ఉండే దిగువ కక్ష్యలలో తిరుగుతుంటాయి. ఇవి భూమి చుట్టూ తిరిగే వేగం వల్ల ఒక ప్రాంతాన్ని రోజుకు ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే చూడగలవు. కానీ ఈ లోపాన్ని నివారిస్తూ, భూమిపై ఒక నిర్దిష్ట ప్రాంతాన్ని ఎల్లప్పుడూ (24/7) ప్రత్యక్షంగా చూడాలనే లక్ష్యంతో ఇస్రో EOS-05 ఉపగ్రహాన్ని రూపకల్పన చేసింది. ఈ ఉపగ్రహాన్ని సుమారు 2,300 కిలోగ్రాముల కంటే ఎక్కువ బరువుతో, అత్యాధునిక కెమెరా పేలోడ్లతో సిద్ధం చేశారు.

Also Read : చెన్నైలో ఒలింపిక్ సిటీ.. ఫార్ములా-1కు గ్రీన్ సిగ్నల్!

ఈ ప్రయోగంలో అత్యంత కీలకమైన ఘట్టం రాకెట్ ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టిన కక్ష్య. GSLV-F17 రాకెట్ ఈ ఉపగ్రహాన్ని భూమికి 36,000 కిలోమీటర్ల ఎత్తులో ఉండే జియోసింక్రోనస్ ఆర్బిట్ లోకి ప్రవేశపెట్టింది. భూమి తన అక్షం చుట్టూ తాను ఒకసారి తిరగడానికి 24 గంటల సమయం పడుతుంది. ఈ 36,000 కిలోమీటర్ల ఎత్తులోని ఉపగ్రహం కూడా భూమి చుట్టూ ఒక రౌండ్ వేయడానికి సరిగ్గా 24 గంటల సమయాన్నే తీసుకుంటుంది. దీనివల్ల భూమి తిరిగే వేగం, ఉపగ్రహం తిరిగే వేగం సమానమై… భూమిపై నుంచి చూసినా లేదా అంతరిక్షం నుంచి చూసినా ఆ ఉపగ్రహం ఒకే చోట స్థిరంగా నిలబడి ఉన్నట్లు అనిపిస్తుంది. ఇంతటి భారీ ఎత్తులో స్థిరంగా ఉండటం వల్ల ఈ ఉపగ్రహానికి ఉన్న శక్తివంతమైన మల్టీ-స్పెక్ట్రల్ కెమెరా లెన్స్ ఒకే ఒక్క క్లిక్‌తో దక్షిణాఫ్రికా లాంటి ఒక ఖండాన్ని లేదా మొత్తం భారతదేశ భూభాగాన్ని ఒకే ఫ్రేమ్‌లో ఫొటో తీయగలదు.

మన దేశ సరిహద్దు ప్రాంతాల్లో లేదా సముద్ర జలాల్లో శత్రు దేశాల నౌకలు, సైనిక కదలికలు ఉంటే ఈ ఉపగ్రహం సెకన్ల వ్యవధిలో హెచ్చరికలు పంపుతుంది. కేవలం రొటీన్ ఫొటోలు కాకుండా లైవ్ వీడియో స్ట్రీమింగ్ తరహాలో సమాచారాన్ని అందించడం వల్ల రక్షణ దళాలకు ఇది అతిపెద్ద బలంగా మారింది. సముద్రంలో తుఫాను ఎలా వస్తుంది. అడవుల్లో కార్చిచ్చు ఏ దిశగా వ్యాపిస్తోంది. నదుల్లో వరద ఉధృతి ఎలా ఉందనే విషయాలను ప్రతీ క్షణం పర్యవేక్షించవచ్చు. దీనివల్ల ప్రమాదం జరగడానికి ముందే హెచ్చరికలు జారీ చేసి వేలాది మంది ప్రాణాలను కాపాడే అవకాశం లభిస్తుంది.

మేఘాలు అడ్డుగా ఉన్నప్పటికీ, రాత్రి వేళల్లో అయినా సరే భూమిపై పంటల స్థితిగతులను, మేఘాల దాత్రీకరణను ఇది స్పష్టంగా తీయగలదు. కరువు పరిస్థితులను ముందే అంచనా వేయడానికి, పంట దిగుబడిని లెక్క వేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. భూస్థిర కక్ష్య నుంచి భూమిని ఇలా నిరంతరం, అత్యధిక స్పష్టతతో వీక్షించే సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచంలో అతికొద్ది దేశాల వద్ద మాత్రమే ఉంది. ఇస్రో తన స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన GSLV రాకెట్ ద్వారా ఈ ప్రయోగాన్ని విజయవంతం చేసింది.