
Woman Wrestler : మహారాష్ట్రలో విషాద ఘటన జరిగింది. జాతీయ స్థాయి మహిళా రెజ్లర్ తన ముగ్గురు పిల్లలతో కలిసి నల్దుర్గ్ కోట నుంచి సుమారు 100 అడుగుల లోతైన లోయలోకి దూకినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో రెజ్లర్తో పాటు ఇద్దరు పిల్లలు చనిపోయారు. మరో చిన్నారి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
మృతురాలిని అశ్విని మనోహర్ పాల్గా గుర్తించారు. ఆమెకు ఐదున్నరేళ్ల కుమారుడు అజింక్య ఉన్నాడు. లోయలో పడిన వెంటనే అశ్విని, అజింక్య అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె రెండున్నరేళ్ల కవల కుమార్తెల్లో ఒకరైన క్రాంతి కూడా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. మరో కవల కుమార్తె వీరా పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ధారాశివ్ ప్రభుత్వ ఆస్పత్రిలో వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు.
Also Read : ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. 12 మంది మృతి..
అశ్విని పాల్ రెజ్లింగ్ రంగంలో మంచి పేరు తెచ్చుకున్నారు. ఆమెను మహారాష్ట్ర టైగ్రెస్ అని కూడా పిలిచేవారు. తన క్రీడా జీవితంలో జాతీయ స్థాయిలో ఐదు బంగారు పతకాలు, ఆరు వెండి పతకాలు గెలుచుకున్నారు. అశ్విని, ఆమె పిల్లల మరణంతో మహారాష్ట్రలో, క్రీడా రంగంలో తీవ్ర విషాదం నెలకొంది. మంచి క్రీడాకారిణిని, ఆమె పిల్లలను కోల్పోవడం చాలా బాధాకరమని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.
అశ్విని తండ్రి మాత్రం ఆమెను భర్త, అత్తమామలు చాలా కాలంగా మానసికంగా, శారీరకంగా వేధించారని ఆరోపించారు. ఈ ఆరోపణలతో పాటు అసలు ఏం జరిగిందనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై నల్దుర్గ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అశ్విని పిల్లలతో కలిసి లోయలోకి దూకడానికి దారితీసిన పరిస్థితులు ఏమిటన్న దానిపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
Also Read : తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన ఫోక్ డ్యాన్సర్ ఈశ్వర్సాయి..ఎందుకంటే?









