Israel

Israel Parliament : ఇజ్రాయెల్ పార్లమెంటు రద్దయింది. అక్టోబర్ 27న జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలోని ప్రభుత్వం పలు వివాదాస్పద బిల్లులను ఆమోదించింది. దాదాపు మూడేళ్లుగా సాగుతున్న యుద్ధం, అంతర్గత రాజకీయ సంక్షోభం నేపథ్యంలో, నెతన్యాహు తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి చివరి నిమిషంలో అనేక ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసే ప్రయత్నం చేశారు.

ఆక్రమిత వెస్ట్ బ్యాంక్‌లో కొత్తగా 34 సెటిల్‌మెంట్ల ఏర్పాటు కోసం 1.3 బిలియన్ షెకెళ్ల (సుమారు 431 మిలియన్ డాలర్లు) నిధులను, అలాగే సెటిల్‌మెంట్లకు అనుసంధానంగా కొత్త రోడ్ల నిర్మాణానికి మరో 1.075 బిలియన్ షెకెళ్ల (సుమారు 358 మిలియన్ డాలర్లు) నిధులను పార్లమెంటు ఆమోదించింది.

Also Read : న్యూజిలాండ్‌లో భారీ భూకంపం!

అల్ట్రా-ఆర్థడాక్స్ పార్టీలను తన కూటమిలో కొనసాగించేందుకు, ఆ వర్గానికి చెందిన పురుషులకు సైనిక సేవ నుండి మినహాయింపునిచ్చే బిల్లులను నెతన్యాహు ప్రభుత్వం ఆమోదించింది. ప్రభుత్వానికి మీడియాపై మరింత నియంత్రణ లభించేలా, అటార్నీ జనరల్ పాత్రను బలహీనపరిచేలా న్యాయవ్యవస్థ సంస్కరణలకు సంబంధించిన పలు బిల్లులను నెతన్యాహు నెగ్గించుకున్నారు. వీటిని అటార్నీ జనరల్ గాలి బహరావ్-మియారా తీవ్రంగా వ్యతిరేకించారు.

నెసెట్ స్పీకర్ అమీర్ ఒహానా పార్లమెంటు రద్దును ప్రకటిస్తూ, తమ ప్రభుత్వం నాలుగు ఏళ్ల పూర్తి కాలాన్ని విజయవంతంగా పూర్తి చేసిందని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ చరిత్రలో ఒక ప్రభుత్వం పూర్తి కాలం అధికారంలో ఉండటం అరుదు. 1988 తర్వాత మళ్లీ ఇప్పుడు నెతన్యాహు ప్రభుత్వం మాత్రమే పూర్తి కాలాన్ని పూర్తి చేసింది.

అయితే, నెతన్యాహుపై వస్తున్న అవినీతి ఆరోపణలు, యుద్ధ నేరాల ఆరోపణల నేపథ్యంలో ఆయనకు రాజకీయంగా సవాళ్లు ఎదురవుతున్నాయి. మాజీ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్, ఇతర ప్రతిపక్ష పార్టీలకు ప్రజల్లో ఆదరణ పెరుగుతుండటంతో, రాబోయే ఎన్నికలు ఆసక్తికరంగా మారనున్నాయి. 2019 నుండి 2022 మధ్య కాలంలో ఇజ్రాయెల్ ఐదుసార్లు ఎన్నికలను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అక్టోబర్ 27న జరగబోయే ఎన్నికలు ఇజ్రాయెల్ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చనున్నాయి.

Also Read : ట్రంప్ మరో సంచలనం… విదేశీ విద్యార్థులకు బిగ్ షాక్!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.