
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ సమావేశాల రెండో రోజు కూడా సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. బీఆర్ఎస్ సభ్యుల నినాదాలతో సభలో ఉద్రిక్త పరిస్థితి కనిపించింది. స్పీకర్ గడ్డం ప్రసాద్, మాజీ మంత్రి హరీశ్రావు మధ్య మాటల యుద్ధం జరిగింది. హరీశ్రావుపై స్పీకర్ గడ్డం ప్రసాద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నా తల్లిని దూషించారు. నా తల్లిదండ్రుల గురించి అవమానకరంగా మాట్లాడారు. నాపై చేసిన వ్యాఖ్యలకు ఏం సమాధానం చెప్తారు అంటూ హరీశ్రావును స్పీకర్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ సభ్యులు సభలో ఆందోళనకు దిగడంతో స్పీకర్ కూడా గట్టిగానే స్పందించారు. మీరు లొల్లి పెడితే నేను భయపడను అంటూ స్పష్టం చేశారు. సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మి అంటే తనకు ఎంతో గౌరవమని చెప్పారు.
Also Read : స్పీకర్పై కామెంట్స్ .. BRS MLC తాతా మధు అరెస్ట్!
మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన ఘటనపై ప్రభుత్వం న్యాయం చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. సబితా ఇంద్రారెడ్డి గొంతు పిసికారు. సునీతా లక్ష్మారెడ్డి చీర లాగి అవమానించారు. న్యాయం చేయాలని అడిగితే వారిపైనే కేసులు పెట్టారని ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీని కౌరవ సభగా మార్చారు అంటూ హరీశ్రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యవహారంపై మంత్రి శ్రీధర్బాబు కూడా స్పందించారు. నిన్నటి ఘటనలపై నివేదిక తీసుకుంటున్నామని చెప్పారు. సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి ఇద్దరిపైనా తమకు గౌరవం ఉందన్నారు. హరీశ్రావు స్పీకర్ను బెదిరించేలా మాట్లాడుతున్నారు. సభను ఎలా నడపాలో స్పీకర్కు చెప్పే హక్కు వారికి లేదు. మహిళా ఎమ్మెల్యేలపై జరిగిన ఘటనపై స్పీకర్ నివేదిక కోరారు. స్పీకర్పై జరిగిన విషయాన్ని మాత్రం పక్కన పెట్టాలనడం సరికాదు అని శ్రీధర్బాబు మండిపడ్డారు.
Also Read : హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్న్యూస్.. త్వరలో ఆర్టీసీ, మెట్రో జాయింట్ పాస్









