
Terrorist : జమ్మూకశ్మీర్లోని బుద్గాం జిల్లాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. అతని దగ్గర నుంచి ఒక ఏకే రైఫిల్ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం ఆర్మీ, జమ్మూకశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్ కలిసి బుద్గాం జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఈ ఆపరేషన్ చేపట్టాయి. పుల్వామా జిల్లాలోని పఖేర్పోరా నుంచి కొంతమంది ఉగ్రవాదులు బుద్గాంలోని యూస్మార్గ్ వైపు వెళ్తున్నారన్న సమాచారం భద్రతా బలగాలకు అందింది.
Also Read : BCCI సంచలనం.. 62 మంది క్రికెటర్లపై వేటు!
దీంతో ఆశ్దార్ గలీ ప్రాంతంలో గాలింపు మొదలుపెట్టారు. గాలింపు సమయంలో అనుమానాస్పద కదలికలను భద్రతా బలగాలు గుర్తించాయి. అక్కడ ఉన్నవారిని ఆపి తనిఖీ చేయాలని కోరగా, ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. దీంతో భద్రతా బలగాలు కూడా ఎదురుకాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. అతని నుంచి ఏకే రైఫిల్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని శ్రీనగర్ కేంద్రంగా పనిచేస్తున్న చినార్ కార్ప్స్ కూడా తెలిపింది.
అయితే మరో ఉగ్రవాది అదే ప్రాంతంలో దాక్కున్నట్లు భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి. దీంతో అక్కడ గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. హతమైన ఉగ్రవాది ఎవరు, అతనికి చెందిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కశ్మీర్ లోయలో కొన్ని నెలలుగా ఉగ్రవాదుల కార్యకలాపాలు పెద్దగా కనిపించలేదు. ఆ తర్వాత ఇప్పుడు మళ్లీ ఎన్కౌంటర్ జరగడం గమనార్హంగా మారింది.
Also Read : పాక్ జెట్ను కూల్చిన అభినందన్ ముందస్తు రిటైర్మెంట్!









