
BCCI : వయసు విషయంలో తప్పుడు వివరాలు ఇచ్చినట్లు ఆరోపణలు రావడంతో బెంగాల్ లెగ్ స్పిన్నర్ రోహిత్ యాదవ్పై బీసీసీఐ రెండేళ్ల నిషేధం విధించింది. ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరగబోయే సిరీస్కు భారత అండర్-19 జట్టులో ఎంపికైన కొద్ది రోజులకే ఈ నిర్ణయం తీసుకుంది. యూపీకి చెందిన రోహిత్ యాదవ్ ఇటీవల జూలైలో భారత అండర్-19 జట్టుతో కలిసి శ్రీలంక పర్యటనకు వెళ్లాడు. అక్కడ ఆరు వికెట్లు తీసి, చివరి టెస్ట్లో భారత్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు రోహిత్పై రెండేళ్ల నిషేధం విధించినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఈ నెలలో రాజ్కోట్, అహ్మదాబాద్లో ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరిగే వన్డేలు, మల్టీ-డే మ్యాచ్లకు కూడా అతను ఎంపికయ్యాడు. అయితే ఇప్పుడు ఆ మ్యాచ్ల్లో ఆడే అవకాశం లేదు.
Also Read : జమ్మూకశ్మీర్లో ఎన్కౌంటర్.. ఉగ్రవాది హతం!
అతని ఆధార్ వివరాల్లో కూడా తేడాలు కనిపించాయి. బెంగాల్ క్రికెట్ సంఘం వద్ద రిజిస్టర్ చేసినప్పుడు పుట్టిన సంవత్సరం 2007గా ఉంది. ఆ తర్వాత 2017, 2020లో ఆధార్ వివరాలను మార్చినప్పుడు 2006గా నమోదైంది. 2021లో మళ్లీ 2009గా మార్చినట్లు గుర్తించారు. ఈ తేడాలను ముందే గుర్తించిన బెంగాల్ క్రికెట్ సంఘం రోహిత్ను తమ జూనియర్ జట్లకు దూరంగా పెట్టింది. ఆ తర్వాత ఈ విషయం బీసీసీఐకి కూడా తెలిపింది. ఇప్పుడు బీసీసీఐ రోహిత్ దేశవాళీ క్రికెట్లో రెండేళ్ల పాటు ఆడకుండా నిషేధించింది. ఈ నిర్ణయాన్ని అన్ని రాష్ట్ర క్రికెట్ సంఘాలకు కూడా తెలియజేసింది.
రోహిత్ ఒక్కరిపైనే కాదు.. బెంగాల్ క్రికెట్ సంఘం మొత్తం 62 మంది ఆటగాళ్ల పత్రాలు, వయసు వివరాలను పరిశీలించింది. వివరాల్లో తేడాలు ఉన్న 62 మందిని 2026-27, 2027-28 సీజన్లలో ఏ టోర్నమెంట్లోనూ రిజిస్టర్ చేసుకోవడానికి లేదా బదిలీ చేయడానికి అనర్హులుగా ప్రకటించింది. ఈ జాబితాలో భారత అండర్-19 ప్రపంచకప్ గెలిచిన జట్టులో సభ్యుడైన రవి కుమార్ కూడా ఉన్నాడు. అలాగే మూడు ఫస్ట్ క్లాస్, రెండు లిస్ట్-ఏ మ్యాచ్లు ఆడిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ఆల్రౌండర్ విశాల్ భట్టి కూడా ఉన్నాడు. 2022లో భారత్ అండర్-19 ప్రపంచకప్ గెలవడంలో రవి కుమార్ కీలకంగా ఉన్నాడు. అయితే బెంగాల్ క్రికెట్ సంఘం రికార్డుల్లో అతని వయసుకు సంబంధించి 45 నెలల తేడా ఉన్నట్లు గుర్తించారు.









