Russia : ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక ఇంజినీర్‌ను రష్యాలో అక్కడి పోలీసులు అరెస్ట్‌ చేశారని ఆయన భార్య ఆరోపించడం కలకలం రేపింది. వర్క్ వీసాపై రష్యాకు వెళ్లిన తన భర్త ఇంజినీర్ చందన్ గుప్తా ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అక్కడి సైన్యంలో చేరాలని ఒత్తిడి చేస్తున్నారని ఆయన భార్య స్నేహగుప్తా ఆరోపిస్తున్నారు. తన భర్తను, తనను సురక్షితంగా స్వదేశానికి తిరిగివచ్చేలా చూడాలని ప్రధాని మోదీ , యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కోరుతూ ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఆమె ఓ వీడియో పోస్ట్‌ చేయడంతో అది వైరల్‌గా మారింది.

ఆమె పోస్ట్‌ చేసిన వీడియో ప్రకారం.. కాన్పూర్‌కు చెందిన చందన్ గుప్తా కొన్నేళ్ల క్రితం నోయిడాలోని కంపెనీ తరఫున ఉద్యోగరీత్యా వర్క్‌ వీసాపై ఫ్యామిలీతో కలిసి రష్యాకు వెళ్లారు. అక్కడే భార్య స్నేహ గుప్తా, 10 ఏళ్ల కుమారుడితో కలిసి ఉంటున్నారు. అయితే ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో రష్యా పోలీసులు తన భర్తను అరెస్టు చేశారని స్నేహ ఆరోపించారు. తనకు రష్యన్‌ భాష రాకపోవడంతో ఆయనను ఎందుకు అరెస్ట్‌ చేశారో మొదట తెలుసుకోలేకపోయానని ఆ వీడియోలో ఆవేదన వ్యక్తంచేశారు. ఎలాంటి తప్పు చేయనప్పటికీ అతడిని జైలులో ఉంచారని పేర్కొంది. అయితే స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఉక్రెయిన్‌ తో యుద్ధం కారణంగా రష్యా సైన్యంలో సిబ్బంది కొరత ఉండడంతో.. విదేశీయులను తమ సాయుధ దళాల్లోకి చేర్చుకునేందుకు కొంతకాలంగా అక్కడి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా పోరాడటానికి రష్యన్ సైన్యంలో చేరాలని పోలీసులు తన భర్తపై ఒత్తిడి తెస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

అందులో భాగంగానే తన భర్తను అదుపులోకి తీసుకున్నారని స్నేహ తెలిపారు. తనతో పాటు తన పదేళ్ల కుమారుడు ఉన్నాడని, తన కుటుంబం సురక్షితంగా భారత్‌కు తిరిగివచ్చేలా చూడాలని ఆమె ప్రధాని మోదీ, ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి అధిత్యానాథ్‌ ని కోరారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో మాస్కోలోని భారత రాయబార కార్యాలయం వెంటనే స్పందించింది. ఈ విషయాన్ని స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపింది.అలాగే చందన్ గుప్తా భార్య స్నేహ గుప్తాతో సంప్రదింపులు జరుపుతున్నామని ప్రకటించింది. అతని విడుదల కొరకు రష్యాలోని భారత ఎంబసీతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొంది.

కాగా ఉక్రెయిన్‌- రష్యాల మధ్య యుద్ధం మెుదలై సుమారు నాలుగేళ్లు కావస్తోంది. అయినప్పటికీ యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. అయితే ఈ యుద్ధంలో రష్యా సైనికులు పెద్ద ఎత్తున మృతిచెందడంతో రష్యాకు సైనికుల కొరత ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలోనే రష్యా ఉద్యోగాల పేరుతో ఆశ చూపి భారతీయులను రష్యాకు రప్పిస్తోంది. ఆ తర్వాత వారిని రష్యా సైన్యంలోకి చేర్చుకుంటున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఈ విషయంలో భారతదేశం సైతం స్పందించింది. ఇప్పటివరకూ 227 మంది భారతీయులు రష్యా సాయుధ దళాల్లో చేరినట్లు వెల్లడించింది. అయితే, వారిలో 139 మందిని భారత్‌ విడుదల చేయించగా, 51 మంది మరణించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మిగిలిన ఇండియన్స్‌ను కూడా త్వరలోనే విడుదల చేయించి, తిరిగి రప్పించేందుకు భారత్ రష్యా తో సంప్రదింపులు కొనసాగిస్తోందని మంత్రిత్వ శాఖ తెలిపింది.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.