Supreme Court: దేశంలో వాహనాలు నడిపే వారికి సుప్రీంకోర్టు బిగ్ షాక్ ఇవ్వనుంది. ఇప్పటివరకు బండికి పెట్రోల్ లేదా డీజిల్ కొట్టించాలంటే డబ్బులు ఉంటే చాలు. కానీ ఇకపై అలా కాదు. బండికి చెల్లుబాటు అయ్యే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంటేనే పెట్రోల్ బంకుల్లో ఇంధనం వేస్తారు. లేకపోతే ఇవ్వరనే నిబంధన తీసుకురావాలని భావిస్తోంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వానికి, ఇన్సూరెన్స్ నియంత్రణ మండలికి సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

Also Read : గోల్డ్ లవర్స్‌కి బిగ్ షాక్.. WGC సంచలన నివేదిక.. త్వరలోనే పెరగనున్న ధరలు

మన దేశంలో రహదారులపై తిరుగుతున్న కోట్లాది వాహనాల్లో మెజారిటీ వాహనాలకు కనీస బీమా లేకపోవడం పట్ల సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో ప్రస్తుతం సుమారు 30.48 కోట్ల వాహనాలు నమోదు అయి ఉంటే.. అందులో ఏకంగా 16.54 కోట్ల వాహనాలకు అసలు ఎలాంటి ఇన్సూరెన్స్ లేదు. అంటే దాదాపు 56 శాతం మంది వాహనదారులు ఎలాంటి బీమా రక్షణ లేకుండానే రోడ్లపై తిరిగేస్తున్నారు.

ఇలా ఇన్సూరెన్స్ లేని వాహనాలు ప్రమాదానికి గురైనప్పుడు బాధితులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రమాదాల్లో గాయపడిన వారికి లేదా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి రావాల్సిన పరిహారం దక్కడం లేదు. యజమానుల నిర్లక్ష్యం వల్ల అమాయక ప్రజలు బలైపోతున్నారు. అందుకే సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Also Read : చిన్నారులను టార్గెట్ చేస్తున్న సైలెంట్ కిల్లర్.. గుజరాత్‌ను గజగజలాడిస్తున్న చండీపురా వైరస్

వాహనదారులు ఇన్సూరెన్స్ క్రమం తప్పకుండా తీసుకునేలా చేయడానికి ‘నో ఇన్సూరెన్స్ – నో ఫ్యూయల్’ అనే కొత్త విధానాన్ని ప్రతిపాదించారు. దీనికోసం ముందుగా రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖతో కలిసి ఒక పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించాలని కోర్టు సూచించింది. పెట్రోల్ బంకుల వద్ద ఉండే స్కానర్లు లేదా సిస్టమ్స్ ద్వారా బండి నంబర్ నమోదు చేయగానే దానికి ఇన్సూరెన్స్ ఉందో లేదో తెలిసిపోతుంది. ఇన్సూరెన్స్ గడువు ముగిసిపోతే బంకు సిబ్బంది పెట్రోల్ లేదా డీజిల్ పోయరు. దీనివల్ల ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా బీమా రెన్యూవల్ చేయించుకోక తప్పదు.

కేవలం బంకుల్లో చెకింగ్ మాత్రమే కాకుండా కొత్తగా వాహనాలు కొనుగోలు చేసే వారికి కూడా కోర్టు ఓ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం కొత్త కార్లకు 3 ఏళ్ల థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఇస్తుండగా, దానిని 4 ఏళ్లకు పెంచాలని ఆదేశించింది. అలాగే ద్విచక్ర వాహనాలకు ప్రస్తుతం ఇస్తున్న 5 ఏళ్ల గడువును 6 ఏళ్లకు పెంచాలని కోరింది. దీని ద్వారా వాహనం కొన్న తొలి ఏళ్లలో యజమానులకు సుదీర్ఘకాలం పాటు ఇన్సూరెన్స్ రక్షణ లభిస్తుంది.

టెక్నాలజీని ఉపయోగించి నిబంధనలు ఉల్లంఘించే వారిని పట్టుకోవాలని కోర్టు అధికారులను ఆదేశించింది. రహదారులపై ఉండే ఏఎన్‌పీఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాలను కేంద్ర ప్రభుత్వ ‘వాహన్’ పోర్టల్, బీమా డేటాబేస్‌తో అనుసంధానిస్తారు. ఇన్సూరెన్స్ లేని బండి ఏదైనా రోడ్డుపైకి రాగానే ఈ కెమెరాలు ఆ వాహనం నంబర్ ప్లేట్‌ను పసిగట్టి వెంటనే యజమాని ఫోన్‌కు ఇ-చెలాన్ పంపేస్తాయి.

అంతేకాకుండా రోడ్డుపై తనిఖీలు చేసే ట్రాఫిక్ పోలీసులు కూడా వారి వద్ద ఉండే ప్రత్యేక మొబైల్ యాప్‌ల ద్వారా బండి నంబర్ టైప్ చేయగానే ఇన్సూరెన్స్ స్టేటస్ తెలుసుకునే వెసులుబాటు అందుబాటులోకి రాబోతోంది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఇన్సూరెన్స్ లేని వాహనాలు నడిపితే భారీ జరిమానాతో పాటు చట్టపరమైన చిక్కులు, జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది.