Abhijeet Dipke CJP PM Modi : నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై సుదీర్ఘకాలం పాటు సాగిన విద్యార్థి ఆందోళన దేశవ్యాప్తంగా రాజకీయ కలకలం రేపింది. ఈ పోరాటంలో ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే కీలక పాత్ర పోషించి, ప్రధాన నిరసనకర్తగా దేశ దృష్టిని ఆకర్షించారు.ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దాదాపు 36 రోజుల పాటు ఎండనక, వాననక సాగిన జాతీయ స్థాయి విద్యార్థి ఆందోళన ముగిసిన అనంతరం అభిజీత్ దీప్కే బుధవారం తన స్వస్థలమైన మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్ (ఔరంగాబాద్) విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పెద్ద ఎత్తున స్వాగతం లభించింది.

ఛత్రపతి సంభాజీనగర్ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ అభిజీత్ దీప్కే కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాల పనితీరును లక్ష్యంగా చేసుకుంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. దేశ ప్రధాని పదవికి నరేంద్ర మోదీ వెంటనే రాజీనామా చేసి, సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్‌గా మారితే బాగుంటుందని అభిజీత్ ఎద్దేవా చేశారు. ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించడం కంటే ఇన్‌ఫ్ల్యూయెన్సింగ్ పనిని మోదీ చాలా సమర్థవంతంగా చేస్తున్నారని విమర్శిస్తూ, ప్రధాని బాధ్యతలను నిర్వహించే అర్హత మరెవరికైనా ఇవ్వాలని ఆయన అభిప్రాయపడ్డారు.

జులై 20వ తేదీన పార్లమెంట్ మార్చ్ సందర్భంగా జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు పెల్లెట్ తుపాకులతో దాడి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ దాడికి అనుమతి ఇచ్చిన అధికారులతో పాటు బాధ్యులైన కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.పోలీసులు విద్యార్థుల ఇళ్లకు వెళ్లి అరెస్టు చేస్తామని బెదిరించడం దారుణమని, విద్యార్థులు ఉగ్రవాదులు కారని అభిజీత్ స్పష్టం చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినంత మాత్రాన విద్యార్థుల కోపం చల్లారలేదని, ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే యువత ఏకమై ఏకంగా ప్రభుత్వాన్నే మారుస్తుందని హెచ్చరించారు.

Also Read : వింత దొంగలు.. దేవుడికి మొక్కి మరీ హుండీ ఎత్తుకెళ్లారు!

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ‘పరీక్షల అక్రమాల నిరోధక సవరణ బిల్లు-2026’ కేవలం కాగితాలకే పరిమితమైందని ఆయన విమర్శించారు. పేపర్ లీక్ కేసుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని ప్రధాని హామీ ఇచ్చినప్పటికీ, కేసు తొలి విచారణకే సీబీఐ న్యాయవాది హాజరుకాకపోవడంతో విచారణ వాయిదా పడిందని, చట్టాలను సక్రమంగా అమలు చేసే వ్యక్తులు ప్రభుత్వంలో లేరని దుయ్యబట్టారు.

Also Read : 44 ఏళ్లకే అసలైన జీవితం మొదలవుతుంది – త్రిష

అభిజీత్ తల్లి అనితా దీప్కే మీడియాతో మాట్లాడుతూ కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్భావం వెనుక ఉన్న కారణాన్ని వెల్లడించారు. నీట్ పేపర్ లీకేజీ వల్ల నష్టపోయి చాలామంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఆ సమయంలో నాగ్‌పూర్ చెందిన ఒక బాధిత కుటుంబం అభిజీత్‌ను కలిసి తమ ఆవేదనను పంచుకుంటూ ఈ సమస్యపై పోరాడాలని కోరడంతోనే ఆయన ఈ ఉద్యమంలోకి దిగారని తెలిపారు.సీజేపీ ప్రారంభించిన కొత్తలో తమ కుటుంబానికి తీవ్ర బెదిరింపులు వచ్చాయని అనితా దీప్కే గుర్తుచేసుకున్నారు. “బీజేపీలో చేరకపోతే మీ తల్లిదండ్రులకు ఇబ్బందులు తప్పవు” అని బెదిరిస్తూ వచ్చిన వీడియోల కారణంగా తాము ఛత్రపతి సంభాజీనగర్‌ను విడిచిపెట్టి, కొంకణ్ ప్రాంతంలోని బంధువుల ఇంట్లో పక్షం రోజుల పాటు తలదాచుకోవాల్సి వచ్చిందని ఆమె వెల్లడించారు.

ఈ విద్యార్థి పోరాటంతో దేశవ్యాప్తంగా గుర్తింపు రావడంతో అభిజీత్‌కు పెద్ద ఎత్తున వివాహ సంబంధాలు వస్తున్నాయని అనిత తెలిపారు. గతంలో విదేశాల్లో చదువుకునేటప్పుడు ఆర్థికంగా నిలదొక్కుకున్నాకే పెళ్లి అని చెప్పిన అభిజీత్‌కు, జనవరి 2027 నాటికి వివాహం చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు. కుమారుడు తీసుకునే ప్రతి నిర్ణయానికి కుటుంబ మద్దతు ఉంటుందని, ఢిల్లీ నుంచి ఇంటికి వచ్చాక వివాహంతో పాటు భవిష్యత్ కార్యాచరణపై పూర్తి స్పష్టత ఇస్తామని పేర్కొన్నారు.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.