శ్రీశైలంలో తీవ్ర విషాదం నెలకొంది. వడ్డెర సత్రంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. వడ్డెర సత్రంలో రూమ్‌ నంబర్ 12 నుంచి తీవ్రమైన దుర్వాసన రావడంతో నిర్వహకులు తలుపులు ఓపెన్ చేసి చూడగా.. ఐదుగురు శవాలై కనిపించారు. అయితే ఈ ఘటన రెండు రోజుల క్రితమే జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. గదిలోని హాలులో ఇద్దరు ఫ్యాన్‌కు ఉరేసుకోగా, స్నానాల గదిలో ముగ్గురు మహిళలు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

Also Read : IAS ఉద్యోగానికి గుడ్ బై.. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్న ప్రవీణ్ ప్రకాశ్!

సమాచారం అందుకున్న ఆత్మకూరు డీఎస్పీ రామాంజనేయులు, స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతులను శ్రీసత్యసాయి జిల్లా బత్తలపల్లి గ్రామానికి చెందిన పల్లపు సుధాకర్‌ (36), గోగుల ఆదిలక్ష్మి (50), మల్లేశ్వరి (45), శ్రీదేవి (33), మణికంఠ (15)గా పోలీసులు గుర్తించారు. వీరంతా గత నెల రోజులుగా ఇదే సత్రంలో గది అద్దెకు తీసుకుని ఉంటున్నట్లు సమాచారం. అయితే ఆర్థిక ఇబ్బందులు తాళలేకే కుటుంబం అంతా కలిసి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అయితే వీరి ఆత్మహత్యకు ఇంకా ఏవైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

Also Read : బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడిగా మిర్జా ఫఖ్రుల్… మూడు దశాబ్ధాల తర్వాత ఎన్నికలు..