అంతరిక్ష పరిశోధనలలో భారతదేశం ప్రపంచ పెద్ద దేశాలకు గట్టి పోటీ ఇవ్వడానికి రెడీ అవుతోంది. 2035 నాటికి అంతరిక్షంలో సొంతంగా ‘భారతీయ అంతరిక్ష కేంద్రం’ ను కట్టడమే లక్ష్యంగా ఇస్రో ప్లాన్ చేస్తోంది. భూమికి వందల కిలోమీటర్ల ఎత్తులో ఆకాశంలో నిరంతరం తిరిగే ఒక పెద్ద సైన్స్ ప్రయోగశాలను నిర్మించాలని భావించింది. ఈ అంతరిక్ష కేంద్రంలో వ్యోమగాములు కొన్ని నెలల పాటు అక్కడ ఉంటూ భూమి మీద చేయడానికి వీలుకాని అనేక ప్రయోగాలు చేస్తారు. ప్రస్తుతం ఆకాశంలో రెండే రెండు అంతరిక్ష కేంద్రాలు ఉన్నాయి. ఒకటి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నాసా (NASA) నేతృత్వంలో 15 దేశాలు కలిసి దీనిని నిర్మించాయి.

Also Read : ట్రంప్‌కు ఇరాన్ మైండ్ బ్లాక్ కౌంటర్.. అగ్రరాజ్యానికి భారీ స్కెచ్

15 దేశాలకు చెందిన ఐదు అంతరిక్ష సంస్థలైన యునైటెడ్ స్టేట్స్, రష్యా, జపాన్, కెనడా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీల భాగస్వామ్యంతో దీనిని నిర్మించడం వల్ల.. దీన్ని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అని పిలుస్తారు. దీని బరువు 4.2 లక్షల కిలోలు. దీని తయారీకి సుమారు రూ.12 లక్షల కోట్లకు పైగా ఖర్చయినట్లు తెలుస్తోంది. ఈ అంతరిక్ష కేంద్రం అనేది ఒకే యూనిట్ కాదు. అది వేర్వేరు మాడ్యూళ్లను కలిగి ఉంటుంది. ఉదాహరణకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 16 మాడ్యూళ్లు ఉన్నాయి. దీన్ని నిర్మించడానికి 13 సంవత్సరాలు పట్టింది. ఈ అంతరిక్ష కేంద్రం మొదటి మాడ్యూల్ 1998 నవంబర్ 20న ప్రయోగించారు. మొదటి సిబ్బంది 2000 నవంబర్ 2న బయలుదేరారు. చివరి మాడ్యూల్‌ను 2011లో చేర్చారు. ప్రారంభమైనప్పటి నుండి అంతరిక్ష కేంద్రం ఎప్పుడూ ఖాళీగా లేదు. అందులో ఎల్లప్పుడూ వ్యోమగాములే ఉన్నారు.

Also Read : ప్రపంచాన్ని భయపెడుతున్న ఎల్ నినో.. అత్యంత ఎండలు మండే ఏడాదిగా 2027?

రెండోది టియాంగాంగ్. 2021లో చైనా సొంతంగా కట్టుకున్న అంతరిక్ష కేంద్రం ఇది. అయితే ఇప్పటి వరకు ప్రపంచంలో సొంతంగా అంతరిక్ష కేంద్రం ఉన్న ఏకైక దేశం చైనా మాత్రమే. భారత్ ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తే సొంతంగా అంతరిక్ష కేంద్రాన్ని కలిగిన రెండవ దేశంగా చైనా సరసన నిలుస్తుంది. భారత అంతరిక్ష కేంద్రం నిర్మాణానికి వేల కోట్లు ఖర్చు అవుతాయి. అయితే ఈ ప్రాజెక్ట్‌లో మొదటి భాగాన్ని తయారు చేయడానికి భారత ప్రభుత్వం రూ.1763 కోట్లు మంజూరు చేసింది. మొత్తం ఈ భారత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించడానికి రూ.12 వేల నుంచి 15 వేల కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు.

అయితే ఈ మొదటి భాగాన్ని 2028 నాటికి అంతరిక్షంలోకి పంపాలని ఇస్రో చూస్తోంది. మొత్తం 5 భాగాలతో 2035 నాటికి ఈ కేంద్రం పూర్తికానుంది. ఇది భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉంటుంది. దీని బరువు 52 టన్నులు, పొడవు 27 మీటర్లు, వెడల్పు 20 మీటర్లు ఉంటుంది. ఇందులో మొత్తం 5 ముఖ్యమైన గదులు ఉంటాయి. ల్యాబ్‌లు, వ్యోమగాములు ఉండే స్థలాలు ఇందులో ఉంటాయి. ఒకేసారి 3 నుండి 4 మంది వ్యోమగాములు 3 నుండి 6 నెలల పాటు అక్కడ ఉండి ప్రయోగాలు చేయవచ్చు. ఈ ప్రాజెక్ట్ కోసం మన దేశపు సొంత పరిజ్ఞానంతో కొత్త రాకెట్లు, సాంకేతికతను ఇస్రో తయారు చేస్తోంది. 2035 నాటికి దీనిని పూర్తి చేసి 2040 నాటికి భారత వ్యోమగామిని చంద్రునిపైకి పంపడమే ఇస్రో ప్రధాన లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ చేపట్టింది.