AI టెక్నాలజీ రావడం వల్ల ఇండియాలో పెద్ద ఎత్తున ఉద్యోగాలు పోతున్నాయనే ప్రచారంలో నిజం లేదని తేలింది. ఏఐ కారణంగా కొత్త ఉద్యోగాల నియామకాలు భారీగా పెరుగుతున్నాయని నోమురా హోల్డింగ్స్ అనే ప్రముఖ సంస్థ తన నివేదికలో వెల్లడించింది. ఇండియా చాలా పెద్ద కంట్రీ కావడంతో ఇక్కడ పనిచేసే ఉద్యోగుల సంఖ్య కూడా చాలా ఎక్కువ. అందుకే ఏఐ వల్ల కొత్త ఉద్యోగాలు వచ్చినా లేదా పాత ఉద్యోగాలు పోయినా, ఆ ప్రభావం మిగతా దేశాల కంటే మన దగ్గరే సంఖ్యల పరంగా పెద్దదిగా కనిపిస్తుంది.

Also Read : KCR సంచలన నిర్ణయం..పెద్ది కుటుంబానికి భారీ ఆర్థిక సహాయం!

సోనాల్ వర్మ, సీ యింగ్ టో అనే ఆర్థిక నిపుణులు 2022 నుండి ఈ ఏడాది ఆగస్టు వరకు ఆసియా దేశాల్లో సేకరించిన వివరాలతో ఈ నివేదికను తయారు చేశారు. ఈ రిపోర్టు ప్రకారం.. ఇండియాలో ఏఐకి సంబంధించిన రంగాల్లో ఏకంగా 83,100 కొత్త ఉద్యోగాలు వచ్చాయి. కానీ 31,921 మంది మాత్రమే ఉద్యోగాలు కోల్పోయారు. కంపెనీలు కస్టమర్ సపోర్ట్ టీమ్‌ల స్థానంలో చాట్‌బాట్‌లను వాడటం వల్లే ఎక్కువ మంది ఉద్యోగాలు పోయాయి. అయితే ఏఐ కి ఉన్న డిమాండ్ వల్ల ఐటీ చదివిన యువతకు కంపెనీల నుండి మంచి ఆఫర్లు వస్తున్నాయి.

మొత్తంగా ఆసియా దేశాల్లో ఏఐ వల్ల 1,30,758 కొత్త ఉద్యోగాలు రాగా, ఇందులో 90 శాతానికి పైగా టెక్నాలజీ రంగంలోనే ఉన్నాయి. అలాగే మొత్తం 60,654 మంది ఉద్యోగాలు కోల్పోగా, అందులో 60 శాతం మంది బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాలకు చెందినవారే ఉన్నారు. ఈ లెక్కలను చూస్తే ఏఐ వల్ల భారీగా ఉద్యోగాలు పోతున్నాయనే వార్తలు తప్పు అని అర్థమవుతోంది. ఏఐ వలన ఎంట్రెన్స్ లెవల్ జాబ్స్ పోవడం కంటే కొత్త ఉద్యోగాలు రావడమే ఎక్కువగా ఉంది. ఫిలిప్పీన్స్, చైనా వంటి పెద్ద దేశాల్లో కూడా బిజినెస్ ప్రాసెస్ ఔట్‌సోర్సింగ్ ముఖ్యం కాబట్టి అక్కడా ఇదే పరిస్థితి ఉంది.

అయితే AI రావడం వల్ల అందరికీ సమానంగా మేలు జరగడం లేదు. కస్టమర్ కేర్ లేదా డేటా ఎంట్రీ వంటి సాదాసీదా పనులు చేస్తూ ఉద్యోగాలు పోగొట్టుకున్న వారు, వెంటనే ఏఐ ఇంజనీర్లుగా మారి కొత్త ఉద్యోగాలు తెచ్చుకోవడం చాలా కష్టం. పాత పనులకు, కొత్తగా వచ్చే ఏఐ ఉద్యోగాలకు కావలసిన నైపుణ్యాలకు మధ్య చాలా తేడా ఉండటమే దీనికి కారణం. ఇక ఆసియాలోని ఒక్కో దేశంలో ఉద్యోగ రంగాలు వేర్వేరుగా ఉంటాయి కాబట్టి, ఈ లెక్కలను ఒక అంచనాగా మాత్రమే చూడాలని నిపుణులు చెబుతున్నారు.

Also Read : మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్..రేపు వైన్ షాపులు క్లోజ్

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.