
Telangana Girls : తెలంగాణలో ఆడపిల్లల జనన నిష్పత్తి చాలా ఆందోళనకరంగా మారింది. తాజాగా విడుదలైన సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (CRS) నివేదిక ప్రకారం, రాష్ట్రంలో వెయ్యి మంది అబ్బాయిలకు కేవలం 910 మంది అమ్మాయిలు మాత్రమే జన్మిస్తున్నారు. ఇది దేశవ్యాప్త సగటు అయిన 933 కంటే చాలా తక్కువ. గత ఐదేళ్లుగా ఈ పరిస్థితి రోజురోజుకూ దిగజారిపోతోంది. 2019లో 953గా ఉన్న ఈ నిష్పత్తి, 2020లో 937కి, 2021లో 922కి, 2022లో 907కి, 2023లో 906కి పడిపోయింది. 2024లో స్వల్పంగా 910కి పెరిగినప్పటికీ, ఇది ఇప్పటికీ చాలా తక్కువ స్థాయిలోనే ఉంది. 2024లో రాష్ట్రంలో మొత్తం 7.7 లక్షల జననాలు నమోదు కాగా, అందులో 4,03,397 మంది అబ్బాయిలు, 3,67,219 మంది అమ్మాయిలు ఉన్నారు.
దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ పరిస్థితి మరీ వెనుకబడి ఉంది. కేరళ (970), కర్ణాటక (946), తమిళనాడు (938), ఆంధ్రప్రదేశ్ (929) వంటి రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రం చాలా వెనుక ఉంది. దేశంలోని ప్రధాన రాష్ట్రాల్లో కేవలం జార్ఖండ్ (890), బీహార్ (894), గుజరాత్ (908) మాత్రమే తెలంగాణ కంటే తక్కువ జనన నిష్పత్తిని కలిగి ఉన్నాయి.
Also Read : ఎమ్మెల్సీలు అద్దంకి, బల్ముర్ వెంకట్లకు మంత్రి హోదా!
ఈ గణాంకాలు భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ASCI) ప్రొఫెసర్ డాక్టర్ సుబోధ్ కందముతన్ మాట్లాడుతూ, ఆడపిల్లల సంఖ్య తగ్గడం వల్ల భవిష్యత్తులో మహిళా ఉద్యోగుల భాగస్వామ్యం తగ్గుతుందని, అమ్మాయిల పోషకాహారం, ఆరోగ్యంపై దృష్టి సారించాలని, మహిళా సాధికారత కోసం బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు చేయాలని సూచించారు.
ఈ పరిస్థితిని చూస్తుంటే, ఆడపిల్లల విషయంలో వివక్ష ఇంకా కొనసాగుతోందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. సామాజిక కార్యకర్త సాబు మాథ్యూ జార్జ్ ఈ సంఖ్యలను అత్యంత ప్రమాదకరంగా అభివర్ణించారు. గతంలో పేలవమైన నిష్పత్తిని కలిగి ఉన్న హర్యానా వంటి రాష్ట్రాలు ఇప్పుడు మెరుగైన ఫలితాలు సాధిస్తుంటే, తెలంగాణ ఇలా వెనుకబడటం ఆందోళన కలిగిస్తోందని ఆయన అన్నారు. ఇలాగే కొనసాగితే సమాజంలో నేరాలు పెరగడం, అబ్బాయిలకు పెళ్లిళ్లు కావడం కష్టమవ్వడం వంటి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.
Also Read : మరో అవినీతి అనకొండ పట్టివేత..హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్కు వందల కోట్ల అక్రమ ఆస్తులు








