HMDA Chief Engineer ACB Raids: తెలంగాణలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) తన ఉక్కుపాదాన్ని మరింత మోపింది. హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) చీఫ్ ఇంజినీర్ (సీఈ) బ్యాచు రవీందర్ ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారనే పక్కా సమాచారంతో అధికారులు మంగళవారం తెల్లవారుజాము నుంచే మెరుపు దాడులు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ మాజిద్ అలీఖాన్ ఆధ్వర్యంలో నగరంలోని ప్రధాన ప్రాంతాలతో పాటు బంధువులు, సన్నిహితులకు చెందిన దాదాపు 12 నుంచి 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. హెచ్‌ఎండీఏలో కీలక బాధ్యతల్లో ఉంటూ విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిన ఈ ‘అవినీతి తిమింగలం’ గుట్టును అధికారులు రట్టు చేశారు.

Also Read : అమ్మ తప్పు చేశా క్షమించు.. నాలగు నెలలకే నవవధువు ఆత్మహత్య!

రవీందర్ నానక్‌రామ్‌గూడలోని అత్యంత విలాసవంతమైన ‘సుమధుర అక్రోపోలిస్’ అపార్ట్‌మెంట్‌లో నివాసముంటుండగా, అక్కడతో పాటు గచ్చిబౌలి, నిజామాబాద్ తదితర జిల్లాల్లోని నివాసాలపై ఏసీబీ బృందాలు విస్తృత తనిఖీలు చేపట్టాయి. హెచ్‌ఎండీఏ పరిధిలోని లేఅవుట్ అనుమతులు, జోనింగ్ మార్పులు, భారీ ప్రాజెక్టుల టెండర్ల కేటాయింపుల్లో రవీందర్ తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ కోట్ల రూపాయల ముడుపులు స్వీకరించినట్లు ఏసీబీ ప్రాథమిక విచారణలో తేలింది. ప్రభుత్వ రికార్డుల్లోని ఆయన అధికారిక ఆదాయానికి, ప్రస్తుతం లభ్యమైన ఆస్తుల విలువకు పొంతన లేకపోవడంతో అధికారులు ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

సోదాల్లో లభించిన పత్రాల ఆధారంగా ఐటీ కారిడార్ సహా హైదరాబాద్ నగర పరిసరాల్లో రవీందర్ సంపాదించిన భారీ స్థిరాస్తుల చిట్టా బయటపడింది. మసీద్‌బండలో 4 అంతస్తుల భవనం, కొండాపూర్‌లో 2 లగ్జరీ ఫ్లాట్లు, ‘వాసవి అట్లాంటిస్’ లో 3 ఫ్లాట్లు, ‘శ్రీవారి మెడోస్’ లో మరొక ఫ్లాట్‌తో పాటు శంకర్ పల్లి, కిష్టాపూర్ ప్రాంతాల్లో భారీగా ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. అలాగే శంషాబాద్, షాబాద్ పరిధిలో 4 ఎకరాల ఖరీదైన భూమి, మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో 7 ఓపెన్ ప్లాట్లకు సంబంధించిన కీలక పత్రాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్‌లో ఈ స్థిరాస్తుల విలువ వందల కోట్ల రూపాయల్లో ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Also Read : నన్ను నమ్మించి డబ్బులు గుంజి జైలుకు పంపారు.. షాబాద్ హంతకుడి సంచలన వీడియో..

స్థిరాస్తులతో పాటు రవీందర్ నివాసంలో పెద్ద మొత్తంలో నగలూ, గ్యాడ్జెట్లు లభ్యమయ్యాయి. తనిఖీల్లో భాగంగా అర కిలో బంగారం, కిలో వెండి ఆభరణాలు, రూ.4 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు రూ.10 లక్షల విలువైన అత్యాధునిక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు కూడా సీజ్ చేశారు. రవీందర్ పేరిట ఉన్న 4 కీలక బ్యాంక్ లాకర్లను అధికారులు గుర్తించారు. త్వరలోనే వీటిని తెరిచి సోదాలు చేయనుండగా, మరిన్ని ఆర్థిక లావాదేవీల రహస్యాలు, బినామీ ఆస్తుల వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందని సమాచారం.

ఈ సోదాల సమయంలో అధికారులకు రవీందర్ ఇంట్లో 18 విదేశీ మద్యం సీసాలు లభించడం గమనార్హం. పరిమితికి మించి విదేశీ మద్యాన్ని నిల్వ ఉంచుకోవడంతో ఎక్సైజ్ నిబంధనల ఉల్లంఘన కింద కూడా ఆయనపై విచారణ చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ లగ్జరీ వస్తువులు, పత్రాల లభ్యం ద్వారా రవీందర్ ఏ స్థాయిలో అక్రమార్జనకు పాల్పడ్డారో స్పష్టమవుతోందని ఏసీబీ వర్గాలు వెల్లడించాయి.

ఈ సోదాల అనంతరం నిందితుడు రవీందర్‌తో పాటు ఆయన బినామీల పేరిట ఉన్న ఆస్తుల పూర్తి సమాచారాన్ని సేకరించి, చట్టపరమైన తదుపరి చర్యలు తీసుకుంటామని ఏసీబీ ఉన్నతాధికారులు తెలిపారు. ఇటీవల కాలంలో పలువురు బడా అధికారులను టార్గెట్ చేస్తూ ఏసీబీ వరుస దాడులు నిర్వహిస్తున్న నేపథ్యంలో, ఒకేసారి హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజినీర్ ఇళ్లపై ఇన్ని బృందాలు దాడులు చేయడం తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది

MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.