
Maharashtra : శాఖాహారులు ఆరోగ్యంగా ఉండటానికి, ఒంటికి బలం రావడానికి ఎక్కువగా పన్నీర్ తింటూ ఉంటారు. కానీ, ఈ మధ్య కాలంలో పన్నీర్లో కల్తీ విపరీతంగా పెరిగిపోయింది. ఈ సమస్య చాలా ప్రమాదకరంగా మారడంతో, మహారాష్ట్ర ప్రభుత్వం ఒక కఠినమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అసలైన పాలు కాకుండా వేరే పదార్థాలతో చేసే నకిలీ పన్నీర్ దీనినే అనలాగ్ పన్నీర్ అని కూడా అంటారు. అయితే ఈ తయారీని, అమ్మకాలను పూర్తిగా నిషేధించింది. ఫుడ్ సేఫ్టీ చట్టం ప్రకారం ఎవరైనా ఈ రూల్స్ అతిక్రమిస్తే, ఆరు నెలల జైలు శిక్షతో పాటు లక్ష రూపాయల వరకు జరిమానా విధిస్తారు.
Also Read : ఉదయాన్నే ఇలా వాటర్ తాగుతున్నారా.. అయితే మీరు ఈ సమస్యల బారిన పడినట్లే!
ఫుడ్ సేఫ్టీ కమిషనర్ తుకారం ముండే జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, రాష్ట్రంలో ఎక్కడా కూడా ఈ నకిలీ పన్నీర్ను తయారు చేయడం, ప్యాక్ చేయడం, నిల్వ ఉంచడం, లారీల్లో లేదా బండ్లపై రవాణా చేయడం, దుకాణాల్లో హోల్సేల్ లేదా రిటైల్గా అమ్మడం పూర్తిగా నేరం. ఒకవేళ ఈ కల్తీ ఆహారం తిని ఎవరైనా చనిపోతే మాత్రం, చట్టం ప్రకారం జీవిత ఖైదుతో పాటు కనీసం పది లక్షల రూపాయల జరిమానా వేస్తారని స్పష్టం చేశారు. అసలైన పన్నీర్ అని నమ్మించి ఈ నకిలీ పన్నీర్ను అమ్ముతూ ప్రజలను మోసం చేస్తే ఊరుకోమని మహారాష్ట్ర ఎఫ్డీఏ హెచ్చరించింది. ఇది ఫుడ్ సేఫ్టీ చట్టం కింద పెద్ద నేరం. ఇలాంటి మోసాలకు పాల్పడే వాళ్లపై కఠినంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
పాల ఉత్పత్తుల గురించి ఎఫ్ఎస్ఎస్ఏఐ (FSSAI) చెప్పిన దాని ప్రకారం.. పాలతో సంబంధం లేకుండా వేరే వస్తువులను కలిపి, చూడటానికి లేదా వంటల్లో వాడటానికి అసలైన పన్నీర్లాగే కనిపించేలా తయారు చేసే దాన్నే అనలాగ్ అంటారు. సాధారణంగా చెప్పాలంటే.. అసలు పాలు లేకుండా తయారు చేసేదే ఈ అనలాగ్ పన్నీర్. మార్కెట్లో కొంతమంది వ్యాపారులు దీనిని తయారు చేయడానికి చెడ్డ నూనెలు, పిండి పదార్థాలు వాడుతున్నారు. ఇవి తింటే మన ఆరోగ్యం చాలా పాడైపోతుందని నిపుణులు చెబుతున్నారు.
Also Read : చిన్నారులను టార్గెట్ చేస్తున్న సైలెంట్ కిల్లర్.. గుజరాత్ను గజగజలాడిస్తున్న చండీపురా వైరస్









