
Bengaluru : కర్ణాటక రాజధాని బెంగళూరులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కుటుంబ గొడవల కారణంగా ఒక సివిల్ ఇంజనీర్ తన భార్యను దారుణంగా హత్య చేసి, ఆపై తన తల్లికి మెసేజ్ పంపి తాను కూడా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతులను దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ సుమంత్ (32), హుబ్బళ్లికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని పద్మావతి (29)గా పోలీసులు గుర్తించారు.
హెగ్గనహళ్లిలోని రాజేశ్వరి నగర్లోని తమ నివాసంలో బుధవారం రాత్రి ఈ దంపతుల మధ్య గొడవ జరిగింది. తీవ్ర ఆగ్రహానికి గురైన సుమంత్.. భార్య పద్మావతిపై దాడి చేసి, దిండుతో ఊపిరి ఆడకుండా చేసి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. భార్య స్పృహ తప్పి ప్రాణాలు కోల్పోయిందని గ్రహించిన సుమంత్, వెంటనే తన తల్లికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పాడు. ఆ తర్వాత తాను కూడా చనిపోతున్నట్లు తల్లికి మెసేజ్ పెట్టాడు.
మెసేజ్ చూసి తీవ్ర ఆందోళన చెందిన తల్లి వెంటనే ఇంటి యజమానికి సమాచారం అందించింది. యజమాని వచ్చి చూడగా హాలులోని సీలింగ్ ఫ్యాన్కు సుమంత్ ఉరివేసుకుని కనిపిచగా, పద్మావతి ఇంట్లోనే శవమై పడి ఉంది.
ఘటనా స్థలానికి చేరుకున్న రాజగోపాల్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం విక్టోరియా ఆసుపత్రికి తరలించారు. ఈ దంపతుల మధ్య గొడవకు గల కారణాలు, అసలు ఏం జరిగిందనే దానిపై పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నారు.









