కర్ణాటక రవాణా శాఖ మంత్రి బైరతి సురేష్ ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు ముఖానికి మాస్క్ ధరించి సామాన్య ప్రయాణికుడిలా బస్సులో ప్రయాణించారు. బస్సుల నిర్వహణను, సిబ్బంది ప్రవర్తనను స్వయంగా పరిశీలించడం కోసం ఇలా చేశారు. అయితే ఈ తనిఖీల్లో ఆయనకు ఆర్టీసీ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. తనిఖీల్లో భాగంగా మంత్రి బైరతి సురేష్ ఓ బస్సు ఎక్కారు. కండక్టర్ టికెట్ ఇవ్వడానికి రాగా.. మంత్రి వంద రూపాయల నోటు ఇచ్చి రెండు టికెట్లు ఇవ్వమని అడిగారు. అయితే ఆ కండక్టర్ బాధ్యతారహితంగా ప్రవర్తించాడు. తన వద్ద సరిపడా చిల్లర లేదంటూ తన బ్యాగును మంత్రికి చూపించాడు.

అంతేకాకుండా ఒకవేళ చిల్లర లేకపోతే బస్సు దిగిపోవాలంటూ ఏకంగా మంత్రికి సలహా ఇచ్చాడు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అలా మాస్క్ పెట్టి ప్రయాణికుడిలా వచ్చారని తెలియక ఆ కండక్టర్ అలా ప్రవర్తించాడు. ఈ తనిఖీల్లో మంత్రి మరో నిర్లక్ష్యపు ఘటన కూడా చూశారు. బస్సు కోసం ఒక స్టాప్‌లో ఒక ప్రయాణికుడు చేయి చూపించినప్పటికీ.. ముందు వెళ్తున్న బస్సు డ్రైవర్ బస్సును ఆపకుండా అలాగే వెళ్లిపోయాడు. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చాల్సిన డ్రైవర్లు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో మంత్రి కళ్లారా చూశారు. ఆర్టీసీ సిబ్బంది తీరుపై మంత్రి బైరతి సురేష్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి, ప్రయాణికులను ఇబ్బంది పెడుతున్న సదరు కండక్టర్‌ను, బస్సు ఆపకుండా వెళ్లిన డ్రైవర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు.