పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ వాతావరణం నెలకొంది. ప్రపంచ దేశాల వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని తాము మరోసారి మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించడమే కాకుండా, సముద్ర మార్గంలో వెళ్తున్న నౌకలపై వరుస దాడులకు తెగబడుతోంది. ముఖ్యంగా గల్ఫ్ ప్రాంతాలు అయిన ఖతార్, ఒమన్ దేశాలను ఇరాన్ టార్గెట్ చేసి దాడులు చేపట్టింది.

ఇరాన్ ఇలాంటి దాడులు చేయడానికి ముఖ్య కారణం.. గల్ఫ్ దేశాల ఆర్థిక మూలాలను దెబ్బతీయడమే అని తెలుస్తోంది. ఇరాన్ దాడులు చేపట్టడంతో గల్ఫ్ దేశమైన ఖతార్ కీలకమైన నిర్ణయం తీసుకుంది. తమ దేశ సముద్ర పరిధిలో సాగే అన్ని రకాల కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయాలని వాణిజ్య నౌకల యాజమాన్యాలను ఆదేశించింది. తదుపరి ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చేంత వరకు వాణిజ్య నౌకలు, విహార నౌకలతో పాటు స్థానిక చేపల బోట్లను కూడా రేవులకే పరిమితం చేయాలని స్పష్టం చేసింది. ప్రస్తుత తరుణంలో ప్రజా భద్రత, నౌకల రక్షణను దృష్టిలో ఉంచుకునే ఖతార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

ఖతార్ రాజధాని నగరం దోహాపై ఇరాన్ ఏకంగా బాలిస్టిక్ క్షిపణులతో దాడికి తెగబడింది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను ఖతార్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సకాలంలో గుర్తించి.. వాటిలో కొన్నింటిని గాల్లోనే విజయవంతంగా కూల్చివేసింది. అయినప్పటికీ ఈ క్షిపణి దాడుల శకలాలు నివాస ప్రాంతాలపై పడటం వల్ల కొందరు పౌరులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇరాన్ నుంచి ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా, వాటిని సమర్థంగా తిప్పికొట్టేందుకు తమ సైనిక సేనలు పూర్తి సన్నద్ధంగా ఉన్నాయని స్పష్టం చేసింది.