జమ్మూ కశ్మీర్‌లో తమ ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహించుకోవడానికి భద్రతా దళాల కంట పడకుండా తప్పించుకోవడానికి పాకిస్థాన్ ఐఎస్ఐ, ఉగ్రవాద సంస్థలు మరో కొత్త కమ్యూనికేషన్ మార్గాలను ఎంచుకున్నాయి. వాట్సాప్, సిగ్నల్ వంటి సాధారణ మెసేజింగ్ యాప్‌ల పట్ల భారత భద్రతా సంస్థల నిఘా పెరగడంతో వారు ఇప్పుడు అశ్లీల వెబ్‌సైట్లు, టోర్ ఆధారిత యాప్‌లను ఆశ్రయరిస్తున్నట్లు తెలుస్తోంది.

ఆన్‌లైన్ గేమింగ్ వేదికల దుర్వినియోగాన్ని అధికారులు అడ్డుకోవడంతో ఉగ్రవాదులు తమ రూటు మార్చారు. కొన్ని అశ్లీల వెబ్‌సైట్‌లు, యాప్‌లు పక్కపక్కనే ఉండే వినియోగదారులను కనెక్ట్ చేసేందుకు లేదా డేటింగ్ పేరుతో రియల్-టైమ్ చాట్ ఫీచర్లను అందిస్తుంటాయి. ఐఎస్ఐ ఏజెంట్లు, ఉగ్రవాద హ్యాండ్లర్లు ఈ ఫీచర్లను తమ నియామకాలు, నిధుల మార్పిడి, దాడుల ప్రణాళికల సమాచారం మార్పిడి కోసం వాడుకుంటున్నారు. సోషల్ మీడియాకు భిన్నంగా వీటిలో వినియోగదారుల అసలు గుర్తింపు దొరకడం అధికారులకు కష్టంగా మారింది.

Also Read : చైనాలో న్యూ కల్చర్.. ఆసుపత్రులు, బ్యాంకులు, నైట్‌క్లబ్‌లలోనూ పెళ్లిళ్లు.. కారణం తెలిస్తే షాక్!

భారత ఏజెన్సీలు చేపడుతున్న డిజిటల్ నిఘా నుంచి తప్పించుకునేందుకు ‘కోటెక్స్’, ‘కోనియన్’, టోర్ ఆధారిత మెసేజింగ్ అప్లికేషన్‌లను కూడా పరిశీలిస్తున్నారు. ది ఆనియన్ రౌటర్ ద్వారా ఇంటర్నెట్ ట్రాఫిక్ వేర్వేరు దేశాల్లోని నోడ్‌ల ద్వారా ఎన్‌క్రిప్ట్ అయ్యి ప్రయాణిస్తుంది. దీనివల్ల సమాచారం పంపేవారు, అందుకునే వారి లోకేషన్ లేదా వివరాలను కనిపెట్టడం సవాలుగా మారింది. దేశంలో కోనియన్ ఆండ్రాయిడ్ యాప్‌లపై ఇప్పటికే యాక్సెస్ పరిమితం చేసినట్లు సమాచారం.

ఫోన్ నంబర్ లేదా సీమ్ కార్డ్‌తో పనిలేకుండా అనామకతను అందించే వియత్నాం ఆధారిత ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లను, అలాగే ‘మూన్‌చాట్’ వంటి రహస్య సేవల వైపు ఈ ఉగ్రవాద గ్రూపులు మొగ్గు చూపుతున్నాయి. వీటిలో అనేక వెర్షన్లు పీజీపీ ఎన్‌క్రిప్షన్‌ను ఉపయోగిస్తున్నాయి, దీనికి సంప్రదాయ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అవసరం ఉండదు. ఇది భద్రతా దళాలకు కఠినమైన డిజిటల్ సవాలుగా మారింది.

ఈ తరహా సైబర్ ఉగ్రవాదం ‘సైబర్ జిహాద్’ కార్యకలాపాలపై భారత భద్రతా సంస్థలు, ఎన్ఐఏ కన్ను వేశాయి. డార్క్ వెబ్, నాన్-ట్రాకబుల్ యాప్‌లపై పర్యవేక్షణ పెంచుతూ వివిధ విదేశీ ప్లాట్‌ఫారమ్‌లపై దృష్టి సారించాయి. టోర్ వంటి ఓపెన్-సోర్స్ నెట్‌వర్క్‌లను ఉగ్రవాదులు తమ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తున్న నేపథ్యంలో డిజిటల్ సెక్యూరిటీని ఏజెన్సీలు మరింత కఠినతరం చేస్తున్నాయి.

Also Read : ఆఫ్ఘనిస్థాన్‌లో భారీ భూకంపం!