అమెరికాలో స్థిరపడాలని, అక్కడ ఉన్నత చదువులు చదవాలనుకునే భారతీయు విద్యార్థులకు, ఐటీ ఉద్యోగులకు అక్కడి ప్రభుత్వం బిగ్ షాకిచ్చింది. వీసా దుర్వినియోగాన్ని అరికట్టేందుకు డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం హెచ్-1బీ వీసాలు, గ్రీన్ కార్డ్‌లు, అంతర్జాతీయ విద్యార్థుల వీసా నిబంధనలను భారీగా సవరించడానికి సరికొత్త ప్రతిపాదనలను సిద్ధం చేసింది. ఈ కొత్త మార్పులు అమల్లోకి వస్తే అమెరికాలోని లక్షలాది మంది భారతీయులపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది.

Also Read : భారత్‌లో ఐరన్ డోమ్ క్షిపణుల ఉత్పత్తి కేంద్రం: ఇజ్రాయెల్ రక్షణ సంస్థ ‘రాఫెల్’ చర్చలు!

కొత్త ప్రతిపాదనల ప్రకారం విదేశీ ఉద్యోగులను నియమించుకునే అమెరికన్ కంపెనీలకు అయ్యే ఖర్చులు భారీగా పెరగనున్నాయి. ముఖ్యంగా భారతీయ ఐటీ కంపెనీలు ఎక్కువగా ఉపయోగించే థర్డ్-పార్టీ క్లయింట్ లొకేషన్ల మోడల్‌పై కఠినమైన నిఘా పెట్టనున్నారు. కంపెనీలు తమ ఉద్యోగులతో ఉన్న సంబంధాన్ని, వారు నిజంగానే స్పెషాలిటీ పనులు చేస్తున్నారా లేదా అనే రికార్డులను పక్కాగా చూపించాల్సి ఉంటుంది. దీనికి తోడు కనీస వేతనాల పరిమితిని కూడా పెంచే యోచనలో ఉన్నారు. దీనివల్ల కంపెనీలకు విదేశీ ప్రతిభను స్పాన్సర్ చేయడం మరింత ఖరీదైన వ్యవహారంగా మారనుంది. అంతేకాకుండా హెచ్-1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు ఇచ్చే హెచ్-4, ఈఏడీ వర్క్ పర్మిట్ల ఆటోమేటిక్ ఎక్స్‌టెన్షన్‌ను నిలిపివేయాలని భావిస్తున్నారు. ఇది దాదాపు లక్ష మంది భారతీయ మహిళల ఉద్యోగ భద్రతను ప్రమాదంలో పడేయవచ్చు.

Also Read : ఫైటర్ జెట్ల పహారాలో ఖమేనీ అంతిమయాత్ర: పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ద మేఘాలు!

ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డ్ ప్రక్రియను కూడా యూఎస్ ప్రభుత్వం కఠినతరం చేయనుంది. అమెరికాలో తాత్కాలిక వీసాలపై నివసిస్తున్న వారు గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు.. దేశం దాటకుండా ఇక్కడే స్టేటస్ మార్చుకునే పద్ధతికి బదులుగా.. ఇకపై తమ స్వదేశాలకు వెళ్లి అక్కడ ఉండే ‘కన్సులర్ ప్రాసెసింగ్’ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలనే కొత్త నిబంధనను యూఎస్‌సీఐఎస్ తెరపైకి తెచ్చింది. ఇప్పటికే దశాబ్దాల తరబడి గ్రీన్ కార్డ్ బ్యాక్‌లాగ్‌తో వేచి చూస్తున్న భారతీయ ప్రవాసులకు పెద్ద దెబ్బే అని చెప్పవచ్చు.

భారతీయ విద్యార్థులకు సైతం ఈ కొత్త నిబంధనలు పెద్ద ఇబ్బందిగా మారనున్నాయి. ఇప్పటివరకు ఉన్న “డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్” విధానాన్ని రద్దు చేసి గరిష్ఠంగా 4 సంవత్సరాల కాలపరిమితితో కూడిన విదేశీ విద్యార్థి వీసాలను తీసుకురానున్నారు. ఒకవేళ కోర్సు పూర్తి కావడానికి ఎక్కువ సమయం పడితే.. విద్యార్థులు ప్రత్యేకంగా ఎక్స్‌టెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగ అన్వేషణ కోసం ఇచ్చే గ్రేస్ పీరియడ్‌ను 60 రోజుల నుండి 30 రోజులకు తగ్గించనున్నారు. విద్యార్థులు పార్ట్-టైమ్ చేసుకునే ఓపీటీ, స్టెమ్ ఓపీటీ ప్రోగ్రామ్‌లపై కూడా కఠినమైన ఆంక్షలు విధించే అవకాశం ఉంది.