పశ్చిమాసియాలో యుద్ధాన్ని ఎండ్ చేయడానికి అమెరికా, ఇరాన్ దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరినట్లు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రకటించారు. చాలా కాలంగా సాగుతున్న గొడవలకు ముగింపు పలకడానికి ఈ చర్చలు మంచి పునాది అని జేడీ వాన్స్ అన్నారు. ఈ ఒప్పందం వల్ల అమెరికా ప్రజల ఆర్థిక భవిష్యత్తుకు కూడా ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. ఈ క్రమంలోనే అమెరికాకు చెందిన సోయాబీన్, మొక్కజొన్న, గోధుమలను కొనుగోలు చేయడానికి టెహ్రాన్ అంగీకరిస్తే.. దానికి బదులుగా విదేశాల్లో స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను అమెరికా విడిపిస్తుందని వాన్స్ స్పష్టం చేశారు.

Also Read : మేడ్ ఇన్ ఇండియా పవర్‌.. బ్రహ్మోస్, ఆకాశ్‌తీర్ కోసం ఇంట్రెస్ట్ చూపిస్తున్న దుబాయ్!

JD Vance

ఈ ప్రాథమిక ఒప్పందంలో కుదిరిన నిబంధనలకు ఇరాన్ కట్టుబడి ఉందో లేదో సరిచూడటానికి ఐక్యరాజ్యసమితి అణు తనిఖీ అధికారులు త్వరలోనే ఆ దేశాన్ని సందర్శించనున్నట్లు ఉపాధ్యక్షుడు వెల్లడించారు. అలాగే లెబనాన్ సరిహద్దు వ్యవహారాల్లో సరైన సమన్వయం ఉండేలా ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల నాయకులతో అమెరికా అధికారులు నిరంతరం చర్చలు జరుపుతున్నారని చెప్పారు. ప్రస్తుతం అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి పూర్తిగా తెరిచే ఉందని, ఆ మార్గం గుండా నౌకల రాకపోకలు ఎలాంటి అంతరాయం లేకుండా సాగుతున్నాయన్నారు.

పొరుగు దేశమైన పాకిస్తాన్ చేసిన దౌత్యపరమైన మధ్యవర్తిత్వం వల్లే ఈ అవగాహన ఒప్పందం సాధ్యమైందని ఇరాన్ అధికారులు అధికారికంగా వెల్లడించారు. ఒకవేళ పాక్ నాయకులు చొరవ తీసుకోకపోయి ఉంటే ఈ చర్చలు ముందుకు సాగడం కష్టమయ్యేదని, ప్రాంతీయంగా మళ్లీ ఘర్షణలు తలెత్తే ప్రమాదం ఉండేదని ఇరాన్ తెలిపింది. రాబోయే 60 రోజుల్లో ఒక పూర్తిస్థాయి సమగ్ర ఒప్పందానికి ఎలా చేరుకోవాలనే అంశంపై ప్రస్తుతం ఇరు పక్షాల మధ్య లోతైన చర్చలు జరుగుతున్నాయని ఇరాన్ వెల్లడించింది.

Also Read : అమెరికాలో తెలంగాణ యువకుడి అనుమానస్పద మృతి