
Indonesia : ఇండోనేషియాలోని ఫ్లోరెస్ సముద్ర తీరంలో శనివారం తెల్లవారుజామున 7.7 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. దీంతో తూర్పు నుసా టెన్గారా ప్రాంతంలోని కొన్ని చోట్ల సునామీ వస్తుందని హెచ్చరిక జారీ చేసినట్లు అమెరికాకు చెందిన యూఎస్జీఎస్ సంస్థ తెలిపింది.
ఈ భూకంపం తెల్లవారుజామున సుమారు 3.28 గంటలకు వచ్చింది. దీని కేంద్రాన్ని 8.557 డిగ్రీల దక్షిణ అక్షాంశం, 121.181 డిగ్రీల తూర్పు రేఖాంశం దగ్గర గుర్తించారు. భూమి లోపల కేవలం 10 కిలోమీటర్ల లోతులోనే ఈ భూకంపం వచ్చినట్లు యూఎస్జీఎస్ చెప్పింది. మొదట ఈ భూకంప తీవ్రతను 6.9గా లెక్కగట్టిన ఈఎంఎస్సీ సంస్థ, ఆ తర్వాత దానిని 7.6గా మార్చింది.
Also Read : విదేశాల్లో భారతీయులపై పెరిగిన దాడులు.. విదేశాంగ శాఖ సంచలన డేటా!
ఈ భూకంపం ఫ్లోరెస్ దగ్గర సముద్రంలో రావడంతో, ఆ ద్వీపంలో కొన్ని ఇళ్లు, బిల్డింగ్లు దెబ్బతిన్నాయని వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో తిరుగుతున్న కొన్ని వీడియోల్లో ఇళ్లు కూలిపోయినట్లు కనిపించాయి, కొన్ని బిల్డింగ్లు నేలమట్టమయ్యాయని స్థానిక జనాలు అంటున్నారు. అయితే ఇంకా ఎవరూ అధికారికంగా కన్ఫర్మ్ చేయలేదు.
భూకంపం వచ్చిన తర్వాత ఇండోనేషియా వాతావరణ శాఖ బీఎంకేజీ మాత్రం తూర్పు నుసా టెన్గారా ప్రాంతానికి సునామీ ముప్పు ఉందని చెప్పిన హెచ్చరికను అలాగే ఉంచింది. ఎంబై ప్రాంతానికి ఈశాన్యంగా సుమారు 38 కిలోమీటర్ల దూరంలో, భూమికి చాలా పైభాగంలో అంటే కేవలం 10 కిలోమీటర్ల లోతులోనే ఈ భూకంప కేంద్రం ఉందని ఆ శాఖ వెల్లడించింది.
ప్రపంచంలో భూకంపాలు ఎక్కువగా వచ్చే దేశాల్లో ఇండోనేషియా ఒకటి. ఇది పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అనే ప్రాంతంలో ఉండటం వల్ల ఇక్కడ తరచూ భూకంపాలు, అగ్నిపర్వతాలు బద్దలవుతుంటాయి. మొత్తం 17 వేలకు పైగా చిన్న చిన్న దీవులు ఉన్న ఈ దేశంలో ఇలాంటి భూకంపాలు సర్వసాధారణం.
Also Read : ట్రంప్ సంచలన ప్రకటన: హోర్ముజ్ జలసంధి అమెరికాదే!









