
Venezuela Earthquake : వెనిజులాలో సంభవించిన ప్రళయకరమైన భూకంపం కేవలం ఆ దేశంలోనే కాకుండా, భారత్లోనూ కొత్త ఆందోళనలను రేకెత్తించింది. ఈ భూకంపం వల్ల అక్కడి పోర్టులు దెబ్బతినడం, షిప్పింగ్ ఆలస్యం కావడం, ఇన్సూరెన్స్ ఖర్చులు పెరగడం వంటి కారణాల వల్ల భారత్కు ముడిచమురు దిగుమతి మరింత ప్రియం కానుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. జూన్ 24న వెనిజులాలో కొన్ని సెకన్ల వ్యవధిలోనే సంభవించిన 7.2, 7.5 తీవ్రత కలిగిన రెండు శక్తివంతమైన భూకంపాలు.. గత 125 ఏళ్లలోనే అత్యంత ఘోరమైనవిగా నమోదయ్యాయి. ఈ విపత్తులో వందలాది మంది చనిపోగా, వేల మంది గాయపడ్డారు.
ఇరాన్ యుద్ధం కారణంగా చమురు సరఫరాలో ఏర్పడిన ఆటంకాల నుండి భారత్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో ఈ విపత్తు ముంచుకొచ్చింది. ఇటీవలే అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందంతో ‘హోర్ముజ్ జలసంధి’ ద్వారా చమురు సరఫరా సాధారణ స్థితికి వస్తుందని ఆశించిన భారత్కు.. ఇప్పుడు వెనిజులా భూకంపం కొత్త సవాలుగా మారింది.
నిపుణుల వివరాల ప్రకారం.. ఇటీవల కాలంలో భారతీయ రిఫైనరీలకు వెనిజులా ఒక ప్రధాన ముడిచమురు వనరుగా మారింది. మిడిల్ ఈస్ట్లో నెలకొన్న అస్థిరత కారణంగా ఏప్రిల్, మే నెలల్లో భారత్ తన చమురు దిగుమతుల కోసం వెనిజులాను ప్రత్యామ్నాయ మార్గంగా ఎంచుకుంది. దీంతో చాలా తక్కువ సమయంలోనే భారత్ ఆ దేశంపై ఎక్కువగా ఆధారపడాల్సి వచ్చింది. ఇప్పుడు అక్కడ ఎగుమతి వ్యవస్థ దెబ్బతింటే, ఆ ప్రభావం భారత్తో పాటు ప్రపంచ దేశాలపై కూడా పడనుంది.
ప్రమాదం కేవలం చమురు ప్లాంట్లు దెబ్బతినడానికే పరిమితం కాలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆయిల్ టెర్మినల్స్ సురక్షితంగా ఉన్నప్పటికీ.. విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, రోడ్లు, రవాణా నెట్వర్క్ ధ్వంసం కావడం వల్ల ఓడల రాకపోకలు చాలా వారాల పాటు నిలిచిపోయే ప్రమాదం ఉంది. వెనిజులాలోని ప్రధాన కార్గో పోర్ట్ ‘లా గుఐరా’ను ఇప్పటికే విపత్తు ప్రాంతంగా ప్రకటించడంతో షిప్పింగ్ పరిశ్రమ తీవ్ర ఆందోళనలో పడింది.
Also Read : వెనిజులాలో భూకంప బీభత్సం.. 40 వేల మంది మిస్సింగ్, 235 మంది మృతి!
ఎక్కువ రోజులు వేచి ఉండాల్సి
ఓడలలో సరుకు లోడ్ చేయడానికి ఇప్పుడు ఎక్కువ రోజులు వేచి ఉండాల్సి వస్తుంది. రూట్లు మారడం, ఆలస్యం కావడం వల్ల డెమరేజ్ ఛార్జీలు పెరుగుతాయి. ఈ భారం అంతా వ్యాపారులు, రిఫైనరీలు, ఇన్సూరెన్స్ కంపెనీలపై పడనుంది. ఇప్పటివరకు వెనిజులా నుంచి వచ్చే ఓడలకు కేవలం రాజకీయ, అంతర్జాతీయ ఆంక్షల పరమైన రిస్క్లను చూసి ఇన్సూరెన్స్ పాలసీలు ఇచ్చేవారు. కానీ, ఇప్పుడు భూకంపాల వంటి ప్రకృతి వైపరీత్యాల కోణంలో కూడా ఇన్సూరెన్స్ రిస్క్ను లెక్కించాల్సి వస్తుంది.
భారత ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్జీసీ విదేశ్ కూడా వెనిజులాలోని చమురు ప్రాజెక్టులలో భారీగా పెట్టుబడులు పెట్టింది. అక్కడ ఉత్పత్తి లేదా ఎగుమతులు నిలిచిపోతే భారత్ ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతింటాయి. ఇదే నెలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెనిజులా తాత్కాలిక ప్రెసిడెంట్ డెల్సీ రోడ్రిగ్జ్తో మాట్లాడి.. మైనింగ్, ఫార్మా, ఆటోమొబైల్ రంగాలలో భారత కంపెనీల పెట్టుబడుల గురించి చర్చించారు. అయితే, ఈ భూకంపం కారణంగా ఆ ప్లాన్లన్నీ ఆలస్యమయ్యేలా కనిపిస్తున్నాయి.
మిడిల్ ఈస్ట్పై ఆధారపడటం తగ్గించుకోవడానికి భారత్ వెనిజులా వైపు అడుగులు వేసింది, కానీ ప్రతి కొత్త వ్యాపార మార్గంతోనూ కొత్త సవాళ్లు ఉంటాయని ఈ భూకంపం నిరూపించింది. రాబోయే రోజుల్లో నష్టం తీవ్రతను బట్టి ఆయిల్ మార్కెట్ ఎలా స్పందిస్తుందోనని ఇరు దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి.
Also Read : అమెరికాలోనూ భూకంపం కలకలం!









