Telangana :  హైదరాబాద్ నగరవాసులకు గిగ్ వర్కౌర్లు బిగ్ షాకిచ్చారు. రేపటి నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదురుకానున్నాయి. ఓలా, ఉబర్, ర్యాపిడో క్యాబ్‌లతో పాటు స్విగ్గీ, జొమాటో, జెప్టో, ఇన్‌స్టామార్ట్ వంటి ప్రముఖ ఫుడ్ అండ్ క్విక్ కామర్స్ డెలివరీ యాప్‌ల సేవలు రేపటి నుంచి పూర్తిగా నిలిచిపోనున్నాయి. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సుమారు 4 లక్షల మంది గిగ్, ప్లాట్‌ఫారం వర్కర్లు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు.

ఈ సమ్మె పిలుపును రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 16 వాహన, డెలివరీ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ అధికారికంగా ప్రకటించింది. తమ సమస్యలపై ఇప్పటికే అనేకసార్లు ప్రభుత్వానికి విన్నవించినా ఎలాంటి స్పందనా లేకపోవడంతోనే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సంఘాలు వెల్లడించాయి.

Also Read : రాజమండ్రి డాక్టర్ ప్రియాంక మృతి.. పోలీసుల తీరుపై అనుమానాలు?

సమ్మెలో వీరు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నది చార్జీలను పెంచమని. యాప్ ఆధారిత రవాణా సేవలకు ప్రభుత్వం, ప్లాట్‌ఫారం కంపెనీలు కలిసి కనీస బేస్‌ఫేర్‌తో పాటు ప్రతి కిలోమీటరుకూ, ప్రతి నిమిషానికీ న్యాయమైన చార్జీలను నోటిఫై చేయాలి. దీనివల్ల డ్రైవర్లు, డెలివరీ వర్కర్లకు స్థిరమైన ఆదాయం లభిస్తుంది. దీనితో పాటుగా వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ గిగ్, ప్లాట్‌ఫారం వర్కర్స్ రూల్స్‌ను వెంటనే నోటిఫై చేసి, గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేకంగా వెల్ఫేర్ బోర్డును తక్షణమే ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

మోటర్ వెహికల్స్ చట్టం-1988, మోటర్ వెహికల్ అగ్రిగేటర్ మార్గదర్శకాలు-2025 ప్రకారం కమర్షియల్ రిజిస్ట్రేషన్‌ను మార్చకుండా ప్రైవేట్ ద్విచక్ర, త్రిచక్ర, నాలుగు చక్రాల వాహనాలను యాప్ ఆధారిత ప్రయాణికుల లేదా సరుకు రవాణా సేవలకు ఉపయోగించడాన్ని నిషేధించాలని ప్రధానంగా వాహన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రేపటి నుంచి ఆటోలు, క్యాబ్‌లు దొరక్కపోవడం, ఆన్‌లైన్ ఫుడ్ అండ్ గ్రాసరీ డెలివరీలు నిలిచిపోనుండటంతో నగరవాసులు ముందస్తు ప్రత్యామ్నాయాలు చూసుకోవాలని జేఏసీ సూచించింది.

Also Read : నిరుద్యోగులకు HYDRAA శుభవార్త.. టెన్త్ అర్హతతో ఎగ్జామ్ లేకుండా జాబ్స్.. రేపు, ఎల్లుండే ఛాన్స్!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.