Whatsapp Username Feature
Whatsapp Username Feature

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తరచూ కొత్త కొత్త ఫీచర్లను తీసుకొస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా వినియోగదారుల ప్రైవసీని దృష్టిలో ఉంచుకుని రకరకాల సేఫ్టీ ఫీచర్లను అందుబాటులోకి తెస్తోంది. ఇక ఇప్పుడు యూజర్ల గోప్యతను నెక్స్ట్‌ లెవెల్‌కు తీసుకెళ్లేందుకు మరొక విప్లవాత్మకమైన మార్పును తీసుకొస్తోంది. ఇప్పటి వరకు కాంటాక్ట్ నెంబర్ సేవ్ అయి ఉంటేనే వాట్సాప్‌లో మెసేజ్ చేయడానికి అయ్యేది. దీనికోసం ఇతరులకు మొబైల్ నెంబర్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉండేది. ఇకపై అలాంటి అవసరం లేదు.

వాట్సాప్ కొత్తగా ‘యూజర్‌నేమ్’ (WhatsApp Username Feature) అనే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీనిద్వారా ఇతరుల కాంటాక్ట్ నెంబర్ తెలియకపోయినా.. కొత్త వ్యక్తులతో చాట్ చేసుకోవచ్చు. ఫోన్ నెంబర్ కూడా వారికి కనిపించకుండా హైడ్ చేసుకోవచ్చు.

ఉదాహరణకు: ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ట్విట్టర్, టెలిగ్రామ్ వంటి అకౌంట్లలో ఫోన్ నెంబర్‌తో సంబంధం లేకుండా కేవలం యూజర్ ఐడీతోనే ఇతరులతో కనెక్ట్ అవుతుంటాం. సరిగ్గా అదే పద్ధతిని వాట్సాప్ తీసుకొచ్చింది. దీనివల్ల ఫోన్ నెంబర్ లేకపోయినా.. కేవలం యూజర్‌నేమ్‌ ఉంటే చాలు.. కొత్త వ్యక్తులతో కూడా కనెక్ట్ కావచ్చు. ఎవరితో అయినా చాట్ చేయవచ్చు. మన ఐడీ మాత్రమే ఎదుటివారికి కనిపిస్తుంది.

Also Read : Amazon Prime Day Sale 2026: కెవ్వ్ కేక: ఆఫర్లే ఆఫర్లు.. మైండ్‌ బ్లోయింగ్ డిస్కౌంట్స్.. అస్సలు వదలొద్దు!

కాగా ఎవరుపడితే వారు ఈ ఫీచర్ ద్వారా కనెక్ట్ అవ్వలేరు. కేవలం పూర్తి యూజర్‌నేమ్ తెలిస్తేనే అవతలి వ్యక్తి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వగలరు.

ఒకవేళ మీ యూజర్‌నేమ్ ఎవరికైనా తెలిసి ఇష్టమొచ్చినట్లు మెసేజ్‌లు చేస్తే.. వాటిని ఆపడానికి ‘యూజర్‌నేమ్ కీ’ అనే ఆప్షన్‌ను కూడా వాట్సాప్ అందుబాటులో ఉంచింది.

అలాగే సోషల్ మీడియా క్రియేటర్లు, చిన్న చిన్న బిజినెస్‌లు చేసుకునేవారు తమ బ్రాండ్ పేరును.. వాట్సాప్ యూజర్‌నేమ్‌‌లో రిజర్వ్ చేసుకోవచ్చు.

ఒకవేళ మీకు నచ్చిన పేరును అప్పటికే వేరొకరు పెట్టుకుంటే మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వాట్సాప్ దీనికోసం కూడా ఓ ఆప్షన్ తీసుకొచ్చింది. ‘జనరేటర్ టూల్’ అనే ఆప్షన్‌ను ఉపయోగించి నచ్చిన పేరు పెట్టుకోవచ్చు.

ఈ ఫీచర్ వచ్చే వారం నుండి రిజర్వేషన్ల రూపంలో ప్రారంభం అవుతుంది. ఈ ఏడాది చివరికల్లా యూజర్లందరికీ అందుబాటులోకి రానుంది.

Also Read : పశ్చిమబెంగాల్‌ హల్దియా రిఫైనరీలో భారీ ప్రమాదం, 15 మందికి గాయాలు

MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.