తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే కాటన్ క్యాండీ, గోబీ మంచూరియన్ నిషేధించిన విషయం తెలిసిందే. తాజాగా మరో కృత్రిమ కారకం ఉన్న పదార్థాన్ని నిషేధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. అధిక మోతాదులో కృత్రిమ రంగులు కలిపిన రంగుల పాపడ్‌ల అమ్మకాలపై ఆహార భద్రతా శాఖ నిషేధం విధించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇళ్లలో, రెస్టారెంట్లలో భోజనంతో పాటు వీటిని సాధారణంగా వడ్డిస్తారు. ఇటీవలి సంవత్సరాలలో, రకరకాల ఆకారాలు, డిజైన్లలో ఉండే రంగుల పాపడ్లు పిల్లలు ఎక్కువగా తింటున్నారు. వీటిని తయారు చేసేటప్పుడు ఎక్కువగా కెమికల్స్ ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇలాంటి కెమికల్స్ ఉండేవి తినడం వల్ల క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

Also Read : మోదీ చేతుల మీదుగా తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభం: స్పెషాలిటీస్ ఇవే!

పాపడ్‌లలో కృత్రిమ రంగులను అధికంగా వాడటం వల్ల జీర్ణ సంబంధిత రుగ్మతలు, అలెర్జీలు, మూత్రపిండాల సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. కొన్ని నిషేధిత లేదా అధిక మోతాదులో ఉండే ఆహార రంగులకు దీర్ఘకాలం పాటు గురికావడం వల్ల క్యాన్సర్‌తో సహా తీవ్రమైన అనారోగ్యాల ప్రమాదం కూడా పెరగవచ్చు. ఇలాంటి ఉత్పత్తులను తీసుకునే పిల్లలు అలెర్జీ ప్రతిచర్యలకు, అటెన్షన్-డెఫిసిట్/హైపర్‌యాక్టివిటీ డిజార్డర్‌తో సహా ప్రవర్తనా సమస్యలకు ఎక్కువగా గురయ్యే అవకాశం ఉందని ఆహార భద్రతా శాఖ హెచ్చరించింది.

Also Read : నీట్-యూజీ రీటెస్ట్ ఫలితాలు రిలీజ్.. టాపర్లు వీళ్లే!

కేవలం మినప పప్పు, బియ్యప్పిండి వంటి పదార్థాలతో సహజంగా తయారు చేసిన పాపడ్‌లను వాడాలని ఆహార భద్రతా శాఖ (FSD) వినియోగదారులకు సూచించింది. నిర్దేశిత పరిమితుల్లో ఆమోదిత ఆహార రంగుల వాడకానికి అనుమతి ఉందని.. అయితే అధికంగా లేదా ఆమోదం లేని రంగులను కలిగిన ఉత్పత్తుల అమ్మకానికి అనుమతి ఉండదని అధికారులు స్పష్టం చేశారు. కేవలం పిల్లలను ఆకర్షిస్తాయనే కారణంతో ప్రకాశవంతమైన రంగుల పాపడ్‌లను కొనుగోలు చేయవద్దని తల్లిదండ్రులకు సూచించారు. నిషేధిత రంగుల పాపడ్‌ల అమ్మకాలను నివారించడానికి, ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడానికి మార్కెట్లు, పర్యాటక ప్రదేశాలు, ప్రదర్శనలు,రోడ్డు పక్కన ఉన్న స్టాళ్ల వద్ద తనిఖీలను ముమ్మరం చేయాలని FSD అధికారులను ఆదేశించింది.