
Delhi Police Action : కేంద్ర విద్యాశాఖలో అవకతవకలు, నీట్ (NEET) పేపర్ లీకేజీ వ్యవహారాన్ని నిరసిస్తూ ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) చేపట్టిన నిరసన ప్రదర్శనలు దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద పెద్దఎత్తున విద్యార్థులు, సీజేపీ నాయకులు ఆందోళన బాట పట్టారు. ఈ క్రమంలో నిరసనకారులు పార్లమెంట్ వైపు మార్చ్ చేయడానికి ప్రయత్నించడంతో భద్రతా బలగాలు అడ్డుకున్నాయి.
పార్లమెంట్ మార్చ్ సందర్భంగా నిరసనకారులకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణలు చివరకు హింసాత్మకంగా మారాయి. పరిస్థితులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేయగా, ప్రదర్శనకారులు రాళ్లు రువ్వడంతో వాతావరణం మరింత వేడెక్కింది. ఈ అల్లర్లలో ఇద్దరు అసిస్టెంట్ పోలీస్ కమిషనర్లతో (ACP) పాటు ఆరుగురు పోలీస్ సిబ్బంది, పలువురు నిరసనకారులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలతో రాజధానిలో శాంతిభద్రతల పరిరక్షణ సవాలుగా మారింది.
ఈ హింసాత్మక ఘటనలను తీవ్రంగా పరిగణించిన ఢిల్లీ పోలీసులు అల్లర్లకు పాల్పడిన వారిపై అత్యంత కఠిన చర్యలకు పూనుకున్నారు. నిరసనల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించి, హింసకు పాల్పడే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడమే కాకుండా, వారి పాస్పోర్ట్లను రద్దు చేసే ప్రక్రియను కూడా వేగవంతం చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఉద్యోగాలు, విదేశీ ప్రయాణాలపై తీవ్ర ప్రభావం పడేలా ఈ నిర్ణయం తీసుకోనున్నారు.
పోలీసులు ఈ చర్యల కోసం సమగ్ర ఆధారాల సేకరణను వేగవంతం చేశారు. ఘటనా స్థలాల్లో లభించిన సీసీటీవీ ఫుటేజీలు, మీడియా వీడియోలు, సోషల్ మీడియా డ్రోన్ దృశ్యాలు మరియు ఇతర డిజిటల్ ఆధారాల ద్వారా దాడులు, రాళ్లదాడిలో పాల్గొన్న వారిని గుర్తిస్తున్నారు. శాంతియుతంగా నిరసన తెలపడానికి అనుమతి ఉన్నప్పటికీ, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని హింసను ప్రేరేపించే వారిని ఎలాంటి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టబోమని భద్రతా దళాలు హెచ్చరించాయి.
మరోవైపు, ఆందోళనల దృష్ట్యా ముందుజాగ్రత్త చర్యగా ఢిల్లీలోని ప్రధాన వ్యాపార కేంద్రమైన కన్నాట్ ప్లేస్ (CP)లో అన్ని రకాల దుకాణాలు, కార్యాలయాలు, రెస్టారెంట్లను సాయంత్రం 6.30 గంటలకే మూసివేయాలని అధికారులు అడ్వైజరీ జారీ చేశారు. న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (NDMC) అధికారుల సూచనల మేరకు ‘న్యూఢిల్లీ ట్రేడర్స్ అసోసియేషన్’ (NDTA) ఈ నిర్ణయం తీసుకుంది. వ్యాపార సంస్థలకు ఆస్తి నష్టం జరగకుండా, సాధారణ పౌరుల రక్షణ కోసమే ఈ అత్యవసర మూసివేత అని తెలిపింది.
Also Read : ఓ వైపు ఎల్నినో.. మరో వైపు వర్షాలు.. అసలేం జరుగుతోంది?
ప్రజాందోళనల తీవ్రత కారణంగా రాజధానిలో వరుసగా రెండో రోజు కూడా మెట్రో రవాణా వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. భద్రతా కారణ దృష్ట్యా ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (DMRC) అత్యంత రద్దీగా ఉండే 17 ప్రధాన మెట్రో స్టేషన్లను తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంతవరకు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో రాజీవ్ చౌక్, పటేల్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియట్, సుప్రీం కోర్ట్, మండి హౌస్, ఐటీఓ, ఢిల్లీ గేట్, ఖాన్ మార్కెట్, శివాజీ స్టేడియం వంటి కీలక స్టేషన్లు ఉన్నాయి.
మెట్రో సేవలు అకస్మాత్తుగా నిలిచిపోవడంతో రోజువారీ ప్రయాణికులు, ఉద్యోగులు తీవ్ర అవస్థలు పడ్డారు. వందలాది మంది ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయించాల్సి వచ్చింది. రోడ్లపై వాహనాల రద్దీ ఒక్కసారిగా పెరగడంతో బస్సులు, ఆటోలు, క్యాబ్లు గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్లలో చిక్కుకుపోయాయి. దీనివల్ల సామాన్య ప్రజలకు ప్రయాణ సమయంతో పాటు ఆర్థిక భారం కూడా విపరీతంగా పెరిగింది.
పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ పోలీస్ వ్యవస్థకు అదనపు అధికారాలు కల్పించారు. ఢిల్లీ పోలీసులకు జాతీయ భద్రతా చట్టం (NSA) కింద లభించే ముందస్తు నిర్బంధ (Preventive Detention) అధికారాలను అక్టోబర్ 18 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జూలై 15న ఢిల్లీ ప్రభుత్వ హోం శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, ఎన్ఎస్ఏ సెక్షన్ 3(2) కింద ఈ ప్రత్యేక నిరోధక అధికారాలు పోలీసు కమిషనర్కు లభించాయి.
ఈ అధికారాల పొడిగింపుపై స్పందించిన ఒక ప్రభుత్వ అధికారి, ఇది ప్రతీ మూడు నెలలకోసారి నిబంధనల ప్రకారం జరిగే సాధారణ అధికారాల పునరుద్ధరణ ప్రక్రియ మాత్రమేనని స్పష్టం చేశారు. ప్రస్తుత సీజేపీ నిరసనలను ఉద్దేశించి ప్రత్యేకంగా జారీ చేసిన ఉత్తర్వు కాకపోయినప్పటికీ, ప్రస్తుత శాంతిభద్రతల పరిస్థితుల దృష్ట్యా అల్లరి మూకలను నియంత్రించడానికి ఈ ఎన్ఎస్ఏ చట్టం పోలీసులకు అదనపు ఆయుధంగా మారనుంది.
పేపర్ లీకేజీ వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వం విచారణలు జరుపుతున్నామని, భవిష్యత్తులో ప్రవేశ పరీక్షలను అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తామని హామీ ఇచ్చినప్పటికీ సీజేపీ నాయకులు, విద్యార్థి సంఘాలు సంతృప్తి చెందడం లేదు. ప్రభుత్వం ఇచ్చే ప్రకటనలు, హామీలు కేవలం కాలయాపన కోసమే తప్ప సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడం లేదని వారు ఆరోపిస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
Also Read : పేపర్ లీక్ నిందితులకు బిగ్ షాక్.. ఫాస్ట్ట్రాక్ కోర్టులతో ప్రధాని మోదీ మాస్టర్ ప్లాన్!









