
LPG Cylinder Price : దేశంలోని గృహ వినియోగదారులకు చమురు సంస్థలు మరోసారి గ్యాస్ ధరల షాక్ ఇచ్చాయి. ఇళ్లలో ఉపయోగించే 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరను రూ. 29 మేర పెంచుతూ ప్రభుత్వ రంగ చమురు సంస్థలు శనివారం కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ పెంచిన ధరలు ఆదివారం (జూన్ 7) నుంచే దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో సిలిండర్ ధర రూ. 913 నుండి రూ. 942కు చేరుకుంది. వివిధ రాష్ట్రాల్లో ఉండే స్థానిక పన్నుల (కమర్షియల్ టాక్స్/వ్యాట్) ఆధారంగా ఆయా ప్రాంతాల్లో ఈ ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉంది.
గత మూడు నెలల స్వల్ప వ్యవధిలో గృహ వినియోగ సిలిండర్ ధర పెరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం. అంతకుముందు పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు, అంతర్జాతీయ మార్కెట్ హెచ్చుతగ్గుల నేపథ్యంలో మార్చి 7వ తేదీన చమురు సంస్థలు సిలిండర్పై ఏకంగా రూ. 60 పెంచాయి. తాజా పెంపుతో కలిపి కేవలం 90 రోజుల వ్యవధిలోనే సామాన్యుడిపై ఒక్కో సిలిండర్కు దాదాపు రూ. 89 వరకు అదనపు భారం పడింది. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచిన కంపెనీలు, ఇప్పుడు వంటగ్యాస్ ధరను కూడా పెంచడంతో సామాన్య విక్రేతలు, మధ్యతరగతి కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
ఇంతకాలం కేవలం వాణిజ్య (కమర్షియల్) సిలిండర్ల ధరలనే సవరిస్తూ వచ్చిన చమురు సంస్థలు, ఇప్పుడు గృహ వినియోగదారులపై భారం మోపడానికి అంతర్జాతీయ పరిస్థితులే కారణమని చెప్తున్నాయి. పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ ఇంధన మార్కెట్లలో తీవ్ర అస్థిరత నెలకొంది. దీనికితోడు విదేశాల నుంచి భారత్కు వచ్చే ఎల్పీజీ దిగుమతులు గణనీయంగా క్షీణించడంతో పాటు, దిగుమతి వ్యయం కూడా భారీగా పెరగడం చమురు కంపెనీలపై ఆర్థిక ఒత్తిడిని తీవ్రం చేసింది.
దేశవ్యాప్తంగా ద్రవ్యోల్బణ భారం పెరుగుతున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుత మార్కెట్ అంచనాల ప్రకారం.. గృహాలకు సరఫరా చేసే ఒక్కో ఎల్పీజీ సిలిండర్ విక్రయంపై కంపెనీలకు సుమారు రూ. 703 వరకు నష్టం వస్తోంది. గత మార్చిలో చేసిన రూ. 60 పెంపు కూడా ఈ భారీ నష్టాలను పూర్తిగా పూడ్చలేకపోయింది. ఈ నేపథ్యంలోనే చమురు కంపెనీల ఆర్థిక నష్టాలను తగ్గించుకునేందుకు, అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలకు అనుగుణంగా మరోసారి ధరలను సవరించక తప్పలేదని అధికారులు వివరించారు.









