Ahmedabad Honour Case : నెలరోజుల క్రితం ఓ యువతి బైకుపై వెళుతుండగా అనుకోకుండా ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆ ప్రమాదంలో యువతి తీవ్రగాయపడింది. అనంతరం ప్రాణాలు కోల్పోయింది. హిట్ అండ్ రన్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు వేగాన్ని పెంచారు. ఈ దర్యాప్తు‌లో షాకింగ్ విషయాలు వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే.. గత 26 రోజుల క్రితం అహ్మదాబాద్‌లో ఓ యువతి బైక్‌ పై వెళుతుండగా మరో బైక్‌ ఢీ కొట్టి వేగంగా వెళ్లిపోయింది. ఆ యాక్సిడెంట్‌ కారణంగా తీవ్రంగా గాయపడిన యువతి ఆసుపత్రికి వెళ్లేలోగా మృతి చెందింది. ఇక్కడి వరకు భాగానే ఉంది. కానీ పోలీసుల దర్యాప్తులో షాకింగ్‌ విషయాలు వెలుగు చూశాయి.

మొదట యాక్సిడెంట్‌ అన్న అనుమానంతో హిట్ అండ్ రన్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అక్కడే పోలీసులకు అనేక షాకింగ్ విషయాలు తెలిశాయి. ఆ యువతిది అసలు యాక్సిడెంట్ కానే కాదని, పక్కా ప్లాన్ ప్రకారం చేసిన మర్డర్ అని తేలడం సంచలనంగా మారింది. అంతేకాదు ఆ హత్య చేసింది కన్నతండ్రి, తోడబుట్టినవాడని తెలిసి అంతా ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. పరువు కోసమే తండ్రి, సోదరుడు కలిసి ఆమెను పొట్టన పెట్టుకున్నారని తేలింది. ఈ సంఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read : భర్తలకు షాక్.. పిల్లలతో కలిసి ఇద్దరు మహిళలు జంప్.. నగలు, నగదు కూడా మాయం!

సరిగ్గా మూడు నెలల క్రితం అహ్మదాబాద్‌కు చెందిన సోఫియా అనే యువతి మరో యువకుడితో ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారడం కలకలం రేపింది. ఆ వీడియో సోఫియా తండ్రి మహ్మద్ ఫరూఖ్, అన్న మహ్మద్ హాబిల్ కూడా చూశారు. దీంతో వారు సోఫియాపై తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఆ వీడియో మూలంగా సమాజంలో తాము తలదించుకునే పరిస్థితి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా తండ్రీకొడుకులిద్దరూ కలిసి తమ పరువుపోవడానికి కారణమైన సోఫియాను చంపాలని నిర్ణయించుకున్నారు.

ఫక్కా ప్లాన్‌ ప్రకారం ఆగస్టు 12వ తేదీ అర్థరాత్రి ఆమెను బైకుపై ఊరి బయటకు తీసుకువెళ్లారు. గెల్జీపుర గ్రామం దగ్గర బైకును మట్టి రోడ్డు మార్గంలోకి తీసుకెళ్లారు. అనంతరం హాబిల్.. సోఫియాను ఇనుపరాడ్డుతో విచక్షణా రహితంగా కొట్టాడు. తీవ్రంగా గాయపడ్డ సోఫియాను తండ్రీకొడుకులు మెయిన్ రోడ్డు మీదకు తీసుకువచ్చి అక్కడ పడేశారు. అక్కడ బైకును కూడా ధ్వంసం చేసి ప్రమాదం జరిగినట్లు కథ తయారు చేసుకున్నారు. తమ బైక్‌ను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టివెళ్లిందని హాబిల్ నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. గుర్తు తెలియని వాహనం తమ బైకును ఢీకొట్టడం మూలంగా తమ చెల్లి చనిపోయిందని వారిని నమ్మించే ప్రయత్నం చేశాడు.

ఈ ప్రమాదంలో సోఫియా తలకు తీవ్రమైన గాయాలయ్యాయని, తనకు చిన్న చిన్న గాట్లు పడ్డాయని పోలీసులకు వివరించాడు. వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లారు. గాయాలతో పడి ఉన్న సోఫియాను సోలా సివిల్ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ మరుసటి రోజు సోఫియా తుదిశ్వాస విడిచింది. హిట్ అండ్ రన్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కానీ, పోలీసుల దర్యాప్తులో సోఫియా తండ్రి, సోదరుడే ఈ దారుణానికి ఒడిగట్టారని తేలడంతో పోలీసులు వారినీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Also Read : ఎంతకు తెగించార్రా.. రోడ్డుపైన గణేశుడి విగ్రహాన్నే ఎత్తుకెళ్లిపోయారు!

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.