మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ఇరుముడి థియేటర్లలో రికార్డులు సృష్టిస్తోంది. ఆగస్టు 21న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ డే నుంచి మంచి హిట్ టాక్ సంపాదించుకోవడంతో పాటు కలెక్షన్ల వర్షం కురిపించింది. డైరెక్టర్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు ప్రేక్షకుల నుంచి ఊహించని స్థాయిలో ఆదరణ లభిస్తోంది. వరలక్ష్మీ వ్రతం, వీకెండ్ రోజుల్లో దూసుకెళ్లిన ఈ మూవీ నేడు కూడా థియేటర్లలో తన సత్తా చాటుతోంది. సినిమా విడుదలైన మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌ సొంతం చేసుకోవడంతో ‘ఇరుముడి’ క్రేజ్ రోజురోజుకీ రెట్టింపు అవుతోంది.

సాధారణంగా వీకెండ్ కంప్లీట్ అయ్యాక సోమవారం అంటే థియేటర్లలో ఆక్యుపెన్సీ కొద్దిగా తగ్గుతుంది. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. నేడు అందరూ ఆఫీసులు, స్కూళ్లు ఇలా బిజీగా ఉంటారు. కానీ ఇలాంటి రోజు కూడా ఇరుముడి థియేటర్లన్నీ హౌస్ ఫుల్ అయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. బుకింగ్ యాప్స్ అయిన బుక్‌మైషో, పేటీఎమ్‌లలో టికెట్లు భారీగా అమ్ముడవుతున్నాయి. ఇరుముడి మూవీ మొదటి మూడు రోజుల్లో రూ.71.87 కోట్ల గ్రాస్ వసూళ్లు అయి దూసుకుపోతుంది. అయితే త్వరలోనే ర,100 కోట్లు టర్నోవర్ చేసే అవకాశం కనిపిస్తోంది.

ఈ మూవీలో రవితేజ మార్క్ ఎనర్జీ, డైలాగ్ డెలివరీ, పవర్‌ఫుల్ పర్ఫార్మెన్స్ ప్రేక్షకులను థియేటర్లలో ఈలలు వేయిస్తున్నాయి. కథానాయికగా నటించిన ప్రియా భవానీ శంకర్ తన నటనతో ఆకట్టుకోగా, సీనియర్ నటుడు సాయి కుమార్ కీలక పాత్రలో ఒదిగిపోయారు. శివ నిర్వాణ అందించిన భావోద్వేగాలు, గూస్‌బంప్స్ తెప్పించే యాక్షన్ సన్నివేశాలు, ఆకట్టుకునే ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాకు ప్రధాన బలమని విమర్శకులు ప్రశంసిస్తున్నారు. కొన్ని చోట్ల అసలు టికెట్లు దొరకడం లేదు. దీంతో అదనపు షోలు కూడా వేస్తున్నారంటే.. రవితేజ ఇరుముడి మేనియా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.