Anasuya ,Vishnu Priya
Anasuya ,Vishnu Priya
Anasuya Vishnu Priya: టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ మహిళా సెలబ్రిటీలు అనసూయ(Anasuya Bharadwaj, విష్ణుప్రియ (Vishnu Priya) సోషల్‌ మీడియా వేధింపులు, అసత్య ప్రచారాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులను ఆశ్రయించారు. ఇద్దరూ వేర్వేరు ఘటనలపై స్పందించినప్పటికీ, మహిళా సెలబ్రిటీలపై జరుగుతున్న ఆన్‌లైన్‌ దుష్ప్రచారం, ట్రోలింగ్‌, వ్యక్తిత్వ హననంపై మరోసారి చర్చకు దారితీసింది.

విష్ణుప్రియ తన గురించి తప్పుడు ప్రచారం చేస్తున్న ఓ యూట్యూబ్‌ ఛానల్‌పై మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె, “ఇండస్ట్రీలోని మహిళల గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదు. ఒక అమ్మాయి మరో అమ్మాయి గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరం. ఇది కేవలం నా విషయమే కాదు.. ఇలాగే తప్పుడు ప్రచారం చేసే మరెందరిపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటాను” అని హెచ్చరించారు. సోషల్‌ మీడియా వేదికగా వ్యక్తిగత పరువును దెబ్బతీసే ప్రయత్నాలను సహించబోనని ఆమె స్పష్టం చేశారు.

ఇక అనసూయ తన పేరుతో అసభ్యకరంగా రూపొందించిన ఏఐ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయని ఆరోపిస్తూ స్పందించారు. తన ఫొటోలను మార్ఫింగ్‌ చేసి, కృత్రిమ మేధస్సు (AI) సహాయంతో అసభ్యకరంగా మార్చి పోస్టు చేస్తున్నారని పేర్కొంటూ హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ VC Sajjanar ను ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా ట్యాగ్‌ చేశారు. “ఇలాంటి వాటిని చాలాసార్లు పట్టించుకోకుండా ఉండాలని ప్రయత్నించాను. కానీ పదేపదే అదే జరుగుతుండటంతో అధికారుల దృష్టికి తీసుకువస్తున్నాను” అని ఆమె పేర్కొన్నారు.

అనసూయ ఫిర్యాదుపై స్పందించిన అధికారులు, హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ విభాగాన్ని సంప్రదించాలని సూచించారు. ఈ సందర్భంగా సోషల్‌ మీడియాలో అనసూయకు మద్దతుగా పలువురు నెటిజన్లు స్పందించగా, మరికొందరు విమర్శలు గుప్పించారు. వాటికీ ఆమె తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చారు. ఈ రెండు ఘటనలు సోషల్‌ మీడియాలో మహిళా సెలబ్రిటీలపై జరుగుతున్న ట్రోలింగ్‌, డిజిటల్‌ వేధింపులు, ఏఐ దుర్వినియోగం వంటి అంశాలపై మరింత అప్రమత్తత అవసరమనే చర్చను తెరపైకి తీసుకొచ్చాయి.