UP Case : ఉత్తరప్రదేశ్‌కు చెందిన 16 ఏళ్ల బాలికపై కదులుతున్న స్లీపర్ బస్సులో సామూహిక అత్యాచారం జరిగినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఆగస్టు 4 రాత్రి జరిగిన ఈ ఘటనలో బస్సు డ్రైవర్ కుల్దీప్, కండక్టర్ సందీప్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలు 11వ తరగతి చదువుతున్న విద్యార్థినిగా పోలీసులు గుర్తించారు.

పోలీసుల వివరాల ప్రకారం.. బాధితురాలు ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లాకు చెందినది. కుటుంబ సభ్యులతో జరిగిన గొడవ కారణంగా వారికి చెప్పకుండా ఇంటి నుంచి బయటకు వచ్చింది. నోయిడాలో ఉంటున్న తన బంధువును కలవడానికి బయలుదేరింది. భారీ వర్షం, చీకటి కారణంగా ఆమె పొరపాటున పరి చౌక్ వద్ద దిగిపోయింది. ఆ సమయంలో అక్కడ ఖాళీగా వెళ్తున్న ఓ స్లీపర్ బస్సు కనిపించింది. వర్షంలో చిక్కుకుపోయిన బాలిక సహాయం కోసం బస్సును ఆపమని సిగ్నల్ ఇచ్చింది. బస్సు ఆగడంతో డ్రైవర్, కండక్టర్ ఆమెను బస్సులోకి ఎక్కించుకున్నారు.

Also Read : తుక్కుగూడ నర్సు హత్యకేసు… రాడ్‌తో ముఖంపై బాది అత్యాచారం..

బస్సు నోయిడా సెక్టార్-63కు వెళ్తుందని వారు బాలికకు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అయితే బస్సు కదిలిన కొద్దిసేపటికే కండక్టర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించడం ప్రారంభించాడని ఆరోపణలు ఉన్నాయి. బాలికను డ్రైవర్, కండక్టర్ కలిసి లైంగికంగా దాడి చేశారని పోలీసులు తెలిపారు. ఆమె ప్రతిఘటించడంతో చంపేస్తామని బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం బస్సును ఢిల్లీలోని కశ్మీర్ గేట్ ప్రాంతానికి తీసుకెళ్లి, రింగ్ రోడ్డుపై బస్ టెర్మినల్ సమీపంలో బాలికను వదిలేసి అక్కడి నుంచి పారిపోయినట్లు పోలీసులు చెప్పారు.

భయాందోళనకు గురైన బాలిక వెంటనే కశ్మీర్ గేట్ పోలీసులను సంప్రదించి జరిగిన విషయాన్ని వివరించింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. టిమార్పూర్‌లోని ఓ బస్ పార్కింగ్ ప్రాంతంలో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నేరానికి ఉపయోగించిన స్లీపర్ బస్సును కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆ బస్సులో ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

పోలీసుల ప్రకారం.. అంతకుముందు బస్సు యాంత్రిక సమస్యకు గురవడంతో దాన్ని సూరజ్‌పూర్‌లోని ఓ వర్క్‌షాప్‌కు తీసుకెళ్లారు. మరమ్మతులు పూర్తయ్యాక డ్రైవర్, కండక్టర్ ఖాళీ బస్సును టిమార్పూర్‌కు తీసుకెళ్తున్నారు. అదే సమయంలో పరి చౌక్ వద్ద వర్షంలో చిక్కుకున్న బాలిక వారికి కనిపించింది. బస్సులో స్లీపర్ బెర్త్‌లకు కర్టెన్లు ఉండటంతో లోపల ఏం జరుగుతుందో బయట నుంచి కనిపించని పరిస్థితి ఉందని పోలీసులు తెలిపారు. పరి చౌక్ నుంచి కశ్మీర్ గేట్ వరకు బస్సు సుమారు 47 కిలోమీటర్లు ప్రయాణించినట్లు చెప్పారు. ఈ ఘటనపై పోలీసులు మరింత దర్యాప్తు చేస్తున్నారు. బస్సులో లభించిన ఆధారాలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలను దర్యాప్తు పూర్తయ్యాక వెల్లడించనున్నట్లు పోలీసులు తెలిపారు.

Also Read : అమెరికాలో హత్య చేసి ఇండియాకు పరారీ.. నిందితుడు అరెస్ట్!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.