Meerut Murder Case : ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో జరిగిన ఒక ఘోరమైన ఘటన అందరినీ షాక్‌కు గురిచేసింది. సోషల్ మీడియాలో పుట్టిన ఒక అక్రమ ప్రేమ కోసం కంటికి రెప్పలా చూసుకోవాల్సిన ఆరు నెలల పసికందు ప్రాణాలు తీసేసింది. నౌచందీ పోలీస్ స్టేషన్ పరిధిలో కొన్ని రోజుల క్రితం ఓ కాలువలో దొరికిన చిన్నారి శవం కేసును పోలీసులు ఎట్టకేలకు చేధించారు. ఈ కేసులో పోలీసులు బయటపెట్టిన నిజాలు చూస్తే కన్నతల్లి ప్రేమ ఎంత కఠినంగా మారిందో అర్థమవుతుంది.

పోలీసులు వివరాల ప్రకారం, కాలువలో దొరికిన ఆ ఆరు నెలల బాబు సహరాన్‌పూర్ ప్రాంతానికి చెందిన ఇమ్రాన్, షబానాల కొడుకు సాహిల్ అని తేలింది. డాక్టర్లు చేసిన పోస్టుమార్టంలో ఆ చిన్నారి నీటిలో మునిగి చనిపోయాడని తేలింది. ఈ కేసులో అసలు నిజాలు తెలుసుకోవడానికి పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. బాబు తండ్రి ఇమ్రాన్ పంజాబ్‌లో కూలిపని చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఆ సమయంలో ఇతని భార్య షబానాకు మూడు నెలల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో విశాల్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా కొద్దిరోజుల్లోనే ప్రేమగా మారింది. దీంతో ఇద్దరూ కలిసి ఎక్కడికైనా వెళ్లిపోదాం అనుకున్నారు.

Also Read : హనుమకొండలో దారుణం.. భార్య కాళ్లూ చేతులు కట్టేసి హత్య!

జూలై 12వ తేదీ రాత్రి షబానా ఇంట్లో మందు తెస్తానని చెప్పి తన చిన్నారి సాహిల్‌ను తీసుకుని మీరట్ బస్ స్టాండ్‌కు వెళ్ళింది. అక్కడ ఆమె ప్రియుడు విశాల్ ఆమె కోసం ఎదురుచూస్తున్నాడు. ఆ సమయంలో విశాల్ మాట్లాడుతూ, చిన్నారి మనతో ఉంటే మన పెళ్లిని ఎవరూ ఒప్పుకోరని షబానాకు మాయమాటలు చెప్పాడు. ఆ బాబును తన స్నేహితుడి దగ్గర సురక్షితంగా వదిలేసి వస్తానని నమ్మించి, ఆ పసివాడిని తన చేతుల్లోకి తీసుకుని అక్కడి నుంచి వేరే చోటుకి తీసుకెళ్ళాడు.

విశాల్ ఆ చిన్నారి సాహిల్‌ను వైశాలి కాలనీ దగ్గరకు తీసుకువెళ్ళాడు. అక్కడ ఆ పసివాడి గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత ఆ చిన్నారి శవాన్ని ఎవరికీ కనిపించకుండా ఒక కాలువలో పడేశాడు. ఆ తరువాత తిరిగి షబానా దగ్గరకు వచ్చి, ఆమెను తనతో పాటు హాపూర్‌లోని తన ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయం చెత్త ఏరుకునే ఒక వ్యక్తి కాలువలో చిన్నారి శవాన్ని చూసి పోలీసులకు ఫోన్ చేసి చెప్పారు. పోలీసులు శవాన్ని తీసుకుని పోస్టుమార్టం చేయించారు. అయితే అప్పట్లో ఆ బాబు ఎవరనేది ఎవరికీ తెలియలేదు. ఆ తర్వాత 14 రోజులకు పంజాబ్ నుంచి ఇంటికి వచ్చిన ఇమ్రాన్, భార్య కొడుకు కనిపించకపోయేసరికి చుట్టుపక్కల వెతికి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పోలీసులు విచారణ చేయగా షబానా హాపూర్‌లో ఉన్నట్లు తెలిసింది. దీంతో పోలీసులు జూలై 26వ తేదీన ఆమెను పట్టుకున్నారు. ఇమ్రాన్ తన భార్యను కొడుకు ఎక్కడని అడగగా, విశాల్ స్నేహితుడి దగ్గర వదిలానని అబద్ధం చెప్పింది. సరిగ్గా అదే సమయంలో మీరట్‌లో ఒక చిన్నారి శవం దొరికిన విషయం ఇమ్రాన్‌కు తెలిసింది. అతను వెంటనే అక్కడకు వెళ్లి బట్టలు చూసి చనిపోయింది తన కొడుకు సాహిలే అని గుర్తుపట్టి బోరున విలపించాడు.

దీంతో ఇమ్రాన్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, శుక్రవారం రాత్రి నిందితుడు విశాల్‌ను అరెస్టు చేశారు. పోలీసులు సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా, విశాల్, షబానా ఆ చిన్నారితో కలిసి వెళ్తున్న దృశ్యాలు దొరికాయి.

Also Read : తీవ్ర విషాదం: వరదలో కొట్టుకుపోయిన తల్లికూతుళ్లు!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.