
Vijayawada :దేశమంతా స్వాతంత్య్ర వేడుకలు జరుపుకుంటున్న వేళ విజయవాడలో విషాదం నెలకొంది. స్థానిక కృష్ణనదిలో ఈతకొట్టడానికి నదిలోకి దిగిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. కృష్ణలంకకు చెందిన గౌతమ్, తేజ, జాషువా అనే యువకులు కృష్ణనదిలో స్నానం చేయడానికి వచ్చారు. సరదాగా ఈత కొడుతున్న సమయంలో అకస్మాత్తుగా నీటిలో మునిగిపోవడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రెస్య్కూ బృందాలు, గజ ఈతగాళ్ళను రప్పించారు. ఘటనా స్థలానికి చేరుకున్న వారు సహాయక చర్యలు చేపట్టారు. నదిలో చాలాసేపు గాలించిన తర్వాత ముగ్గురు యువకుల మృతదేహాలను వెలికితీశారు. వీరంతా ఒకే ప్రాంతానికి చెందిన యువకులు కావడంతో మృతుల కుటుంబాల్లో రోదనలు మిన్నంటాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.









