
Pakistan Missile Test : పాకిస్తాన్ రహస్యంగా తన వద్ద ఉన్న మిస్సైళ్లను పరీక్షిస్తోందా? కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని అమెరికా రాయబారి అన్నందుకు నిరాశతో ఆ పనికి పూనుకుందా? ఈ సందర్భంగా తన సైనిక శక్తిని ప్రదర్శించడానికి సిద్ధమైందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. పాకిస్థాన్ తాజాగా తమ వైమానిక ప్రాంతంలో సుమారు 750 కిలోమీటర్ల మేర విమానాల రాకపోకలపై తీవ్ర ఆంక్షలు విధిస్తూ ‘నోటామ్’ (NOTAM – Notice to Airmen) జారీ చేయడం ఈ వాడనకు బలాన్ని చేకూర్చుతోంది. వైమానిక మార్గాన్ని మూసివేయడానికి గల స్పష్టమైన కారణాలను పాక్ ప్రకటించకపోయినప్పటికీ, అంతర్జాతీయ రక్షణ నిపుణులు దౌత్య వర్గాల్లో ఇది తీవ్ర చర్చనీయాంశమైంది.
Also Read : మెలానియా ట్రంప్ మిస్సింగ్.. అమెరికా ఫస్ట్ లేడీ ఎక్కడ?
క్షిపణి పరీక్ష అంచనాలు (ఫతా సిరీస్)
ఏ దేశమైన సాధారణ సైనిక విన్యాసాలకు ఇంత పెద్ద మొత్తంలో (750 కి.మీ) ఆకాశహర్మ్యాన్ని మూసివేయడం అరుదు. అందుకే పాకిస్తాన్ సుదూర లక్ష్యాలను ఛేదించే క్షిపణి లేదా రాకెట్ వ్యవస్థను పరీక్షించే ఉద్దేశంతో ఈ పని చేసి ఉంటుందని అంతర్జాతీయ నిపుణులు భావిస్తున్నారు.
పాకిస్తాన్ ‘ఫతా’ క్షిపణి వ్యవస్థ ను కలిగి ఉంది. ఆ దేశం వద్ద ఇప్పటికే Fatah-1, Fatah-2 మిసైళ్లు ఉన్నాయి. Fatah-3, Fatah-4, Fatah-5 గురించి ఇదివరకే ప్రకటించింది. ఈ నేపథ్యంలో, వీటిలో ఏదైనా ఆధునిక వ్యవస్థను (Advanced Version) లేదా ఎక్కువ దూర పరిధి కలిగిన రకాన్ని పరీక్షించేందుకు ఈ ఏర్పాట్లు చేసి ఉండవచ్చని ఆయా రంగాల నిపుణలు అనుమానిస్తున్నారు. కాగా భవిష్యత్తులో యుద్ధ విమానాలపై ఆధారపడకుండా, నేరుగా భూమి నుంచి సుదూర లక్ష్యాలపై ఖచ్చితమైన సాంప్రదాయ దాడులు చేయడానికి పాకిస్తాన్ ప్రత్యేకంగా ఆర్మీ రాకెట్ ఫోర్స్ కమాండ్ (ARFC) ను బలోపేతం చేస్తోంది.
అమెరికా ప్రకటన – పాకిస్తాన్ ఆగ్రహం
భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ ఇటీవల శ్రీనగర్ పర్యటనలో భాగంగా జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన జమ్మూ కాశ్మీర్ను “భారతదేశంలో ఒక ముఖ్యమైన భాగం” అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డ పాకిస్తాన్ విదేశాంగ శాఖ, అమెరికా తాత్కాలిక రాయబారికి సమన్లు జారీ చేసి దౌత్యపరమైన నిరసన తెలపడమే కాకుండా ఆ వ్యాఖ్యలను ఖండించింది.
Also Read : భయపెడుతున్న విమాన ప్రయాణాలు… రెండు గంటలపాటు గాలిలో ప్రాణాలు
రెండింటి మధ్య సంబంధం ఎంతవరకు నిజం?
కాశ్మీర్పై అమెరికా ప్రకటన వచ్చిన వెంటనే పాకిస్తాన్ 750 కి.మీల నోటామ్ జారీ చేయడంతో, అమెరికా వ్యాఖ్యలతో నిరాశ చెందిన పాకిస్తాన్ తన సైనిక శక్తిని ప్రదర్శించేందుకు సిద్ధమైందా అనే కోణంలో విశ్లేషణలు సాగుతున్నాయి. అయితే, దౌత్యపరమైన ఈ పరిణామానికి ,పాక్ జరిపే సైనిక/క్షిపణి పరీక్షలకు ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు ఇప్పటివరకు ఎటువంటి ఆధారం లేదా అధికారిక నిర్ధారణ లేదు.









