Peddi Premieres: రామ్ చరణ్ హీరోగా నటించిన భారీ చిత్రం “పెద్ది” మరికొన్ని గంటల్లో ప్రీమియర్ షోలతో ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదలకు ముందే అభిమానుల్లో మంచి ఉత్సాహం కనిపిస్తోంది. ముఖ్యంగా అడ్వాన్స్ బుకింగ్స్కు దేశవ్యాప్తంగా మంచి రెస్పాన్స్ లభిస్తోంది. నిజాం ప్రాంతంలో టికెట్ అమ్మకాలు ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ, బుకింగ్స్ వేగంగా కొనసాగుతున్నాయి.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమా లాభాల బాట పట్టాలంటే ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.250 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ను సాధించాలి. అంటే దాదాపు రూ.500 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రావాల్సి ఉంటుంది. ఒక్క ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లోనే థియేట్రికల్ హక్కులు రూ.150 కోట్లకు పైగా అమ్ముడైనట్లు సమాచారం.
ఈ లక్ష్యం చాలా పెద్దదే అయినప్పటికీ, సినిమాపై ఉన్న అంచనాలు, రామ్ చరణ్కు ఉన్న ఫ్యాన్ బేస్ కారణంగా మంచి టాక్ వస్తే ఈ టార్గెట్ అందుకునే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించింది.
తెలుగు రాష్ట్రాల్లో పెద్ది సినిమాకు మంచి ఓపెనింగ్స్ రావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. అయితే సినిమా అసలు పరీక్ష ఇతర రాష్ట్రాల్లోనే ఉంటుంది. ముఖ్యంగా నార్త్ ప్రేక్షకులను ఆకట్టుకోవడం చాలా అవసరం.
ఈరోజు జరిగే ప్రీమియర్ షోలు, మొదటి రోజు కలెక్షన్లు సినిమాకు కీలకంగా మారనున్నాయి. ఇప్పటికే ప్రత్యేక షోలు, టికెట్ ధరల పెంపు వంటి అంశాలు కలెక్షన్స్ కు సహాయపడుతున్నాయి. అయితే సినిమా భవిష్యత్తును నిర్ణయించేది ప్రేక్షకుల నుంచి వచ్చే స్పందనే.
స్పోర్ట్స్ నేపథ్యంతో పాటు కమర్షియల్ యాక్షన్ అంశాలు ఉన్న ఈ సినిమా నార్త్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునే అవకాశం ఉంది. కథలోని ఎమోషన్స్ బాగా కనెక్ట్ అయితే అక్కడ కూడా భారీ వసూళ్లు సాధించే అవకాశముంది. జాన్వీ కపూర్ నటించడం, ఏఆర్ రెహమాన్ సంగీతం అందించడం కూడా సినిమాకు ప్లస్ పాయింట్స్.
రామ్ చరణ్ గత చిత్రం “గేమ్ ఛేంజర్” ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. దీంతో “ఆర్ఆర్ఆర్” తర్వాత ఆయన కెరీర్లో పెద్ది ఒక కీలక చిత్రంగా మారింది.
సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతున్నప్పటికీ దేశంలోని ప్రముఖ మల్టీప్లెక్స్ చైన్లు అయిన పీవీఆర్, ఐనాక్స్, సినీపోలిస్లలో ఇంకా బుకింగ్స్ ప్రారంభం కాలేదు. దీనిపై అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రధాన నగరాల్లో ఈ థియేటర్లు కలెక్షన్లలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.
సమాచారం ప్రకారం, సినిమా బృందం, మల్టీప్లెక్స్ యాజమాన్యాల మధ్య అడ్వాన్స్ చెల్లింపులకు సంబంధించిన కొన్ని విషయాల్లో ఏకాభిప్రాయం లేకపోవడంతో బుకింగ్స్ నిలిచిపోయాయి. ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయని, త్వరలో సమస్య పరిష్కారమవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.
ఢిల్లీ ఎపిసోడ్ హైలైట్..
పెద్ది సినిమాలోని ఢిల్లీ ఎపిసోడ్ గురించి ఇప్పటికే సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. ఈ భాగం ప్రేక్షకులకు గుర్తుండిపోయే అనుభూతిని ఇస్తుందని చిత్ర బృందం చెబుతోంది.
ఎమోషన్స్, మాస్ సన్నివేశాలతో నిండిన ఈ ఎపిసోడ్ సినిమాకు హైలైట్గా నిలుస్తుందని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రేక్షకులు పెద్ది పాత్రను గుర్తుంచుకునేలా కథ ఉండబోతుందని చెబుతున్నారు.
వృద్ధి సినిమాస్ బ్యానర్పై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ చిత్రంలో శివ రాజ్కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ఈ ప్రాజెక్ట్ను సమర్పిస్తున్నాయి.










