Parag Shah : విజయ్‌ ఆంటోని నటించిన బిచ్చగాడు చిత్రం చూసే ఉంటారు. కోట్ల ఆస్తికి వారసుడైన ఆయన తన తల్లి ఆరోగ్యం కోసం కొంతకాలం బిచ్చగాడిగా మారి యాచిస్తాడు. సామాన్యుడిలా మారి గుడి ఎదుట బిచ్చం ఎత్తుకుంటాడు. సరిగా అలాంటి ఘటనే ముంబైలో చోటు చేసుకుంది. ముంబైలోని ఘట్కోపర్ ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే అయిన పరాగ్ షా ఆ రాష్ర్ట ఎమ్మెల్యేలలో అత్యంత ధనవంతుడు. సుమారు రూ.3,300 కోట్ల ఆస్తులు ఆయన సొంతం. అలాంటి ఎమ్మెల్యే ఒక్కసారిగా బిచ్చగాడిగా మారారు. మాసిన గడ్డం, చింపిరి జుట్టు, పాత బట్టలు వేసుకుని చెత్తకాగితాల సంచి చేత పట్టుకుని వీధుల్లో తిరుగుతూ బిచ్చమెత్తాడు.

ఎమ్మెల్యే పరాగ్ షా మేకప్ వేసుకుని బిచ్చగాడి వేషంలో ఘట్కోపర్ స్టేషన్ కాంప్లెక్స్ వీధుల్లో తిరిగాడారు. ఆ సమయంలో ఆయనను ఎవరూ గుర్తుపట్టక పోవడం గమనార్హం. పరాగ్ షా రోడ్డు పక్కన కూర్చుని భిక్షాటన చేస్తూ ఫుట్‌పాత్ పైనే తిన్నారు. ఇతర వీధి బిచ్చగాళ్లలాగే ఆ బీజేపీ ఎమ్మెల్యే కూడా తన రోజును అదే విధంగా గడిపారు. ఓ బిచ్చగాడి దైనందిన జీవితం ఎలా ఉంటుందో అతను ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుందో ఎమ్మెల్యే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు.

ఆ తర్వాత మేకప్ తీసేసి తను బిచ్చగాడి వేషంలో ఉన్నపుడు ఎవరెవరిని కలిశాడో మళ్లీ అదే వ్యక్తులను కలిసి వారి అనుభవాన్ని తెలుసుకున్నాడు. పరాగ్ షా తన అనుభవాన్ని తెలుసుకోవడానికి తాను బిచ్చగాడిగా గడిపిన ప్రదేశాలను తిరిగి సందర్శించారు. ఈసారి ఆయన తన మేకప్‌ను తొలగించి తన నిజ స్వరూపంలో ప్రజలతో మాట్లాడారు. ఈ మొత్తం సంఘటన ఒక వైరల్ వీడియోలో రికార్డ్ చేశారు. ఎమ్మెల్యే చేసిన ఈ ప్రయోగం ఇప్పుడు రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.ఆయన ఘట్‌కోపర్ వీధుల్లో బిచ్చగాడి వేషంలో తిరుగుతున్న వీడియో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఆయన బిచ్చగాడిగా మారడానికి బలమైన కారణం ఉందని ఆయనే స్వయంగా చెప్పాడు.

కోట్ల రూపాయల ఆస్తులున్న ఎమ్మెల్యే బిచ్చగాడి వేషం ఎందుకు వేశారని అంతా మొదట ఆశ్చర్య పోయినా ఆ తర్వాత మొత్తం వ్యవహారం వెనుక ఉన్న అసలు కారణం ఆయనే స్వయంగా వివరించారు. నిజానికి జైన మత గురువు నమ్రముని మహారాజ్ కు పరాగ్‌ షా శిశ్యుడు. ఆయన సూచన మేరకు పరాగ్ షా ఈ అనుభవాన్ని చేపట్టారు. జైన చాతుర్మాసంలో ఓ రోజు బిచ్చగాడి జీవితం గడిపి ఆ అనుభవాన్ని అర్థం చేసుకోమని ఆయనకు సలహా ఇచ్చారట. తన గురువు సలహా మేరకు ఆ ఎమ్మెల్యే తన భద్రతను, విలాసవంతమైన కారును, ఖరీదైన వస్తువులను వదిలిపెట్టి ఓ బిచ్చగాడి వేషం వేశారు. బిక్షటన చేశారు. ఘట్కోపర్ వీధుల్లో ఆయన తిరుగుతుంటే ఆయనను ఎవరూ గుర్తుపట్టలేదు..

కాగా పరాగ్ షా మహారాష్ట్రలోని అత్యంత సంపన్న రాజకీయ నాయకులలో ఒకరిగా గుర్తింపు పొందారు. 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన దాఖలు చేసిన అఫిడవిట్‌లో తన ఆస్తుల విలువ రూ.3,383 కోట్లకు పైగా ఉందని ప్రకటించడం విశేషం. దీంతో ఆయన మహారాష్ట్రలోని అత్యంత ధనిక అభ్యర్థులలో ఒకరిగా గుర్తింపు పొందారు. దాదాపు ఐదేళ్ల క్రితం ఆయన ప్రకటించిన ఆస్తుల విలువ దాదాపు రూ.500 కోట్లు మాత్రమే. కాగా ఐదేళ్లలో ఆయన ఆస్తి భారీగా పెరిగింది. పరాగ్ షా ప్రధానంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు. గతంలో కార్పొరేటర్‌గా ఉన్న పరాగ్ షా ఘట్‌కోపర్ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. ఆయన రాజకీయాల్లోకి రాకముందు వచ్చిన తర్వాత కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో రాణిస్తున్నారు. ఆయన ఘట్‌కోపర్ వీధుల్లో బిచ్చగాడి వేషంలో తిరుగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.