US vs IRAN :  అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం మరింత ముదురుతోంది. ఇరాన్‌కు చెందిన ఐదు ఆయిల్ ట్యాంకర్లపై అమెరికా దాడులు చేయగా.. దానికి ప్రతిగా ఇరాన్ కూడా అమెరికా సైనిక స్థావరంపై క్షిపణులతో దాడి చేసింది. దీంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. గల్ఫ్ ఆఫ్ ఒమన్, ఇరాన్‌లోని ఖార్గ్ ఐలాండ్ సమీపంలో ఉన్న ఐదు ఆయిల్ ట్యాంకర్లను అమెరికా దెబ్బతీసింది. ఇరాన్ తమ నేవీ యుద్ధనౌకపై రెండుసార్లు బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసేందుకు ప్రయత్నించిందని అమెరికా ఆరోపించింది.

Also Read : సింగపూర్ ప్రధానికి కళ్లు చెదిరే జీతం.. ట్రంప్ కంటే ఏకంగా 7 రెట్లు ఎక్కువ!

అయితే ఆ రెండు దాడులను తమ యుద్ధనౌక విజయవంతంగా తప్పించుకుందని అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఈ ఘటనలో అమెరికా సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదని వెల్లడించింది. ఇరాన్‌కు చెందిన ఆయిల్ స్మగ్లింగ్ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న ఐదు నౌకలను లక్ష్యంగా చేసుకున్నామని అమెరికా తెలిపింది. దాడులకు ముందు నౌకల్లో ఉన్న సిబ్బందిని బయటకు వెళ్లాలని అమెరికా ఆదేశించింది. ఆ తర్వాత దాడులు చేసి ట్యాంకర్లు పనిచేయకుండా చేశామని అమెరికా సైన్యం తెలిపింది. ఈ ట్యాంకర్లు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ దాని అనుబంధ సంస్థలకు డబ్బు సమకూర్చే భారీ షాడో ఫ్లీట్ లో భాగమని అమెరికా ఆరోపించింది.

అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ కూడా వెంటనే స్పందించింది. జోర్డాన్‌లోని అల్ అజ్రాక్ ఎయిర్‌బేస్‌లో ఉన్న అమెరికా బలగాలపై ఇరాన్ క్షిపణులు ప్రయోగించినట్లు సమాచారం. జోర్డాన్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇరాన్ ప్రయోగించిన 20 క్షిపణుల్లో 18 క్షిపణులను తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు అడ్డుకున్నాయి. మిగిలిన రెండు క్షిపణులు జనావాసాలకు దూరంగా ఉన్న ఖాళీ ప్రాంతాల్లో పడినట్లు తెలిపారు.

అమెరికా దాడుల్లో రెండు ఇరాన్ ఆయిల్ ట్యాంకర్లు దెబ్బతిన్నట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది. ఒకటి జాస్క్ పోర్టు సమీపంలో, మరోటి ఖార్గ్ ఐలాండ్ దగ్గర దాడికి గురైనట్లు వెల్లడించింది. నౌకల్లో ఉన్న సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారని, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలిపింది. ఇరాన్‌లోని ఖార్గ్ ఐలాండ్ చాలా కీలకమైన ప్రాంతం. యుద్ధం మొదలయ్యే ముందు ఇరాన్ చమురు ఎగుమతుల్లో దాదాపు 90 శాతం ఈ ప్రాంతం నుంచే జరిగేది.

Also Read : ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. అమెరికాపై కెనడా భారీ టారిఫ్‌లు

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.