Vaibhav Suryavanshi : భారతీయ క్రికెట్‌ చరిత్రలో సరికొత్త రికార్డ్స్‌ క్రియేట్‌ చేస్తూ అతి చిన్న వయసులోనే అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న భారత యువ క్రికెటర్‌ వైభవ్‌ సూర్యవంశీ మరో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. 15 ఏళ్ల 157 రోజుల వయసులోనే దులీప్‌ ట్రోఫీ చరిత్రలో అర్ధ శతకం చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. అంతేకాక ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయసు క్రికెటర్‌గా నిలిచాడు. తద్వారా 57 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న రికార్డును సూర్యవంశీ బద్దలు కొట్టాడు. ప్రస్తుతం జరుగుతున్న దులీప్‌ ట్రోఫీ సెమీఫైనల్లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ సెంట్రల్‌ జోన్‌తో ఈస్ట్‌ జోన్‌ తలపడుతున్న విషయం తెలిసిందే. మ్యాచ్‌లో భాగంగా సోమవారం బ్యాటింగ్‌కు దిగిన వైభవ్‌ తనదైన దూకుడుతో ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. కేవలం 42 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. అయితే సెంచరీ కూడా చేస్తాడని అందరూ ఉత్కంఠగా ఎదురు చూడగా మరో 8 పరుగుల దూరంలోనే అంటే 92 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరాడు.

Also Read : డార్క్ వెబ్‌లో ఉగ్ర కుట్ర.. అశ్లీల సైట్లు, సీక్రెట్ యాప్‌లతో పాక్ ISI డర్టీ గేమ్!

57 ఏళ్ల రికార్డు బ్రేక్‌

కాగా, దులీప్‌ ట్రోపీలో అత్యంత చిన్న వయసులో హాఫ్‌ సెంచరీ సాధించిన ఘనత ఇప్పటివరకు లక్ష్మణ్‌ సింగ్‌ పేరిట ఉంది. 1969లో ఆయన తన 16 ఏళ్ల 23 రోజుల వయసులో దులీప్‌ ట్రోఫీలో తొలి అర్ధ శతకం సాధించాడు. అయితే ఆ రికార్డును తాజాగా వైభవ్‌ అధిగమించాడు. ఇక వైభవ్‌ తర్వాతి స్థానంలో పీయూష్‌ చావ్లా ఉన్నాడు. 2025లో 16 ఏళ్ల 307 రోజుల వయసులో చావ్లా ఇదే ట్రోఫీలో హాఫ్ సెంచరీ సాధించాడు.

ఈ మ్యాచ్ లో.. తొలుత బ్యాటింగ్ చేసిన సెంట్రల్ జోన్ జట్టు 266 పరుగుల వద్ద ఆలౌటైంది. రింకు సింగ్(60) హాఫ్ సెంచరీతో రాణించాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఈస్ట్ జోన్ జట్టు 35 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 189 పరుగులు చేసింది. కుమార కుషాగ్రా(0) పూర్తిగా విఫలమయ్యాడు. వైభవ్ సూర్యవంశీ(92) 8 రన్‌ల తేడాతో సెంచరీ మిస్ చేసుకున్నాడు.

Also Read : 13 ఏళ్ల సర్వీస్‌కు గుడ్‌బై .. సీనియర్ ఐఏఎస్ అధికారి భావోద్వేగ లేఖ!

సీనియర్‌ జట్టుకు కెప్టెన్‌గా మరో రికార్డ్‌

కాగా వైభవ్‌ సూర్యవంశీ మరో అరుదైన ఘనత కూడా సాధించాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే సీనియర్‌ పురుషుల జట్టుకు నాయకత్వం వహించే అవకాశం సొంతం చేసుకున్నాడు. దులీప్ ట్రోఫీలో భాగంగా సెంట్రల్ జోన్ జట్టుతో ఈస్ట్ జోన్ జట్టు తలపడుతున్న విషయ తెలిసిందే. ఈస్ట్ జోన్ జట్టు కెప్టెన్ ఇషాన్ కిషన్ కు గాయమవడంతో వైస్ కెప్టెన్ గా ఉన్న వైభవ్‌ స్టాండింగ్‌ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకోవలసి వచ్చింది. సెంట్రల్‌ జోన్‌ ఇన్నింగ్స్‌లో 19వ ఓవర్‌ సమయంలో కిషన్‌ మైదానం వీడడంతో వైభవ్‌ జట్టు పగ్గాలు అందుకొని సరికొత్త రికార్డు సొంతం చేసుకున్నాడు.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.