ఆఫ్రికాలోని కాంగో తూర్పు ప్రాంతంలో అత్యంత ప్రమాదకరమైన ‘బుండిబుగ్యో’ అనే ఎబోలా వేరియంట్ విజృంభిస్తోంది. ఈ భయంకరమైన అంటువ్యాధి బారిన పడి ఇప్పటిదాకా 131 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. అలాగే మరో 513 అనుమానిత కేసులు బయటపడటంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ కొత్త వేరియంట్ వేగంగా వ్యాపించడం, మరణాల సంఖ్య పెరుగుతుండటంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆందోళన వ్యక్తం చేస్తోంది.
Also Read: మెటాలో మళ్లీ లేఆఫ్లు.. 8 వేల మంది ఉద్యోగులు అవుట్ !
అయితే ఈ అరుదైన వేరియంట్ కొన్ని వారాల పాటు ఎవరికీ తెలియకుండా వ్యాప్తి చెందడంపై అధికారుల నిర్లక్ష్యం, సరైన అవగాహన లేకపోవడమే కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాంగోలో మొదటి మరణం జరిగినప్పుడు అధికారులు సాధారణంగా వచ్చే ఎబోలా వైరస్ వేరియంట్గానే భావించి పరీక్షలు చేశారు. అయితే ఆ పరీక్షల్లో నెగటివ్ అని తేలడంతో ముప్పు తప్పిందని భావించారు. ‘బుండిబుగ్యో’ అనే భిన్నమైన వేరియంట్ కావడం వల్ల పాత పద్ధతుల్లో గుర్తించలేకపోయారు. దీంతో వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. అత్యంత ఆందోళనకరమైన విషయం ఏమిటంటే ప్రస్తుతం ఈ అరుదైన వేరియంట్కు మందులు గానీ, సమర్థవంతమైన వ్యాక్సిన్లు గానీ లేవు.
కాంగోలో ఎబోలా వైరస్ కంట్రోల్ తప్పుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెయెసుస్ రంగంలోకి దిగారు. వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన అత్యవసర చర్యలపై చర్చించేందుకు ఒకటి రెండు రోజుల్లోనే WHO ప్రత్యేక విభాగం సమావేశం కానుందని పేర్కొన్నీరు. పట్టణ ప్రాంతాల్లో కేసులు విపరీతంగా పెరగడం, అలాగే ఫ్రంట్లైన్లో ఉన్న ఆరోగ్య సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోవడం, ప్రజల వలసలు ఎక్కువగా ఉండటం లాంటి అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా ఫోకస్ పెట్టనున్నారు.
Also Read: సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. అలా చేస్తే అకౌంట్లోకి వెంటనే రూ. లక్ష!










