UK Airports :  బ్రిటన్‌లోని విమానాశ్రయాల్లో మంగళవారం ఒక్కసారిగా గందరగోళం ఏర్పడింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో సాంకేతిక సమస్య రావడంతో దేశవ్యాప్తంగా విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. దీంతో 1,000కి పైగా విమానాలు రద్దయ్యాయి. బ్రిటన్ ఎయిర్ ట్రాఫిక్‌ను చూసే నేషనల్ ఎయిర్ ట్రాఫిక్ సర్వీసెస్ తమ విమానాల నిర్వహణ వ్యవస్థలో సమస్య వచ్చినట్లు తెలిపింది. సమస్యను పరిష్కరించేందుకు ఇంజినీర్లు వెంటనే రంగంలోకి దిగినట్లు చెప్పింది.

ఈ సమస్య లండన్ హీత్రో సహా పలు విమానాశ్రయాలపై ప్రభావం చూపింది. బ్రిటిష్ ఎయిర్‌వేస్, ఈజీజెట్, KLM, లుఫ్తాన్సా వంటి పెద్ద విమాన సంస్థల విమానాలు కూడా ప్రభావితమయ్యాయి. విమానాలు పూర్తిగా ఆగిపోలేదు. బ్రిటన్ గగనతలం కూడా తెరిచే ఉంది. అయితే విమానాల రాకపోకలను నియంత్రించడంతో భారీగా ఆలస్యాలు, రద్దులు జరిగాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Also Read : సింగపూర్ ప్రధానికి కళ్లు చెదిరే జీతం.. ట్రంప్ కంటే ఏకంగా 7 రెట్లు ఎక్కువ!

సాయంత్రానికి సమస్యను పరిష్కరించినట్లు NATS ప్రకటించింది. తమ వ్యవస్థ మళ్లీ పనిచేయడం మొదలుపెట్టిందని తెలిపింది. అయితే అప్పటికే పెద్ద సంఖ్యలో విమానాలు ఆలస్యం, రద్దు కావడంతో వాటిని సర్దుబాటు చేయడానికి మరికొంత సమయం పడుతుందని చెప్పింది. హీత్రో విమానాశ్రయంలో దాదాపు 100 విమానాలు రద్దయ్యాయి. మరో 367 విమానాలు ఆలస్యంగా నడిచాయి. గాట్విక్ విమానాశ్రయంలో సుమారు 250 విమానాలు ఆలస్యమయ్యాయి. మంగళవారం మధ్యాహ్నం నాటికి ప్రభావితమైన విమానాశ్రయాల్లో దాదాపు 300 విమానాలు రద్దైనట్లు సమాచారం.

లండన్‌కే కాకుండా ఇతర ప్రాంతాల్లోని విమానాశ్రయాలపైనా ప్రభావం పడింది. ఎడిన్‌బర్గ్, ల్యూటన్, బర్మింగ్‌హామ్, అబెర్డీన్, గ్లాస్గో విమానాశ్రయాల్లో కూడా ఆలస్యాలు, రద్దులు చోటుచేసుకున్నాయి. ఐర్లాండ్‌లోని డబ్లిన్ విమానాశ్రయంలోనూ బ్రిటన్‌కు వచ్చే, వెళ్లే విమానాలపై ప్రభావం పడింది. విమాన సంస్థలు కూడా ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపాయి. NATSలో వచ్చిన సమస్య తమ చేతుల్లో లేదని బ్రిటిష్ ఎయిర్‌వేస్ చెప్పింది. ప్రయాణికులను వీలైనంత త్వరగా వారి గమ్యస్థానాలకు పంపేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపింది. ఈ సమస్య కారణంగా బ్రిటిష్ ఎయిర్‌వేస్‌కు చెందిన 96 విమానాలు రద్దయ్యాయి. ఈజీజెట్‌కు 92, KLMకు 20, లుఫ్తాన్సాకు 12, స్విస్‌కు 11 విమానాలు రద్దైనట్లు సమాచారం.

Also Read : కాగ్నిజెంట్‌కు ట్రంప్ బిగ్ షాక్.. గ్రీన్ కార్డ్ దరఖాస్తులపై సస్పెన్షన్!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.