Balochistan :  ఇండియాకు1947 ఆగస్టు 15న స్వాతంత్ర్యం వచ్చింది కానీ, అది దేశ విభజనతో ముడిపడి ఉంది. పాకిస్తాన్ ఆగస్టు 14నే తమ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటుంది. అయితే, అదే పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రాంతంలో మాత్రం పెద్ద సంఖ్యలో ఉన్న విద్రోహులు ప్రతి ఏటా ఆగస్టు 11నే తమ స్వతంత్ర దినోత్సవంగా జరుపుకుంటారు. బలూచిస్తాన్ ఒక వేరే దేశమని, ప్రస్తుతం పాకిస్తాన్ బలవంతంగా దానిని తన అణచివేతలో ఉంచుకుందని వారు బలంగా నమ్ముతారు.

బలూచిస్తాన్‌లోని కలాత్ ప్రాంతాన్ని పాలించిన రాజులు 1947 ఆగస్టు 11నే బ్రిటిష్ వారితో ఒక ఒప్పందం చేసుకుని, తమను తాము స్వతంత్రంగా ప్రకటించుకున్నారు. కానీ ఆ తర్వాత పాకిస్తాన్ ఆ ప్రాంతాన్ని మోసపూరితంగా తన ఆధీనంలోకి తీసుకుంది. ఆనాడు జరిగిన ఆ మోసాన్ని బలూచ్ విద్రోహులు నేటికీ మరిచిపోలేదు, అందుకే ప్రతిసారీ అదే రోజున తమ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఆచరిస్తున్నారు.

బలూచిస్తాన్ ఈ దుస్థితికి రావడానికి పాకిస్తాన్ సృష్టికర్త అయిన మహమ్మద్ అలీ జిన్నా చేసిన మోసమే ప్రధాన కారణం. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఒకప్పుడు కలాత్ రాజులను ఖాన్ అని పిలిచేవారు. ఆ ఖాన్లకు మహమ్మద్ అలీ జిన్నా న్యాయ సలహాదారుడిగా పనిచేశారు. 1946లో కేబినెట్ మిషన్ ముందు స్వయంగా జిన్నాయే కలాత్ ఖాన్ వాదనను వినిపించారు. కలాత్ అనేది ఒక స్వతంత్ర, సార్వభౌమాధికారం కలిగిన రాజ్యమని ఆయన గట్టిగా చెప్పారు. అంతేకాదు, కలాత్ ఒక స్వతంత్ర దేశం కాబట్టి దానిని భారత యూనియన్‌లో కలపడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. బ్రిటిష్ ప్రభుత్వంతో ఉన్న ఒప్పందం ముగిసిన వెంటనే కలాత్ పూర్తి స్వతంత్ర దేశంగా మారుతుందని జిన్నా అప్పట్లో తెలిపారు.

Also Read : చంపేస్తామంటూ ఇరాన్ బెదిరింపులు.. ట్రంప్‌ ఎలా దాక్కున్నాడో చూడండి!

స్వాతంత్ర్యానికి సరిగ్గా కొద్ది రోజుల ముందు, అంటే 1947 ఆగస్టు 4న ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఇందులో కలాత్ ఖాన్, బ్రిటిష్ ప్రతినిధులు, పాకిస్తాన్ ఏర్పాటును కోరిన జిన్నా,లియాకత్ అలీ ఖాన్ పాల్గొన్నారు. కలాత్‌కు 1947 ఆగస్టు 5నే స్వాతంత్ర్యం వస్తుందని, 1838లో దానికి ఏ హోదా అయితే ఉందో అదే హోదాను కల్పిస్తామని ఆ సమావేశంలో అంగీకరించారు. కానీ కాలక్రమేణా పరిస్థితులు మారిపోయాయి. ఆగస్టు 5న కలాత్‌కు స్వాతంత్ర్యం రాలేదు. పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత ఆగస్టు 15న అది తన స్వాతంత్ర్యాన్ని ప్రకటించుకుంది. అంతకంటే ముందే, ఆగస్టు 11న ఆ ప్రాంతం బ్రిటిష్‌వారితో ఒప్పందం చేసుకుంది. అయితే పాకిస్తాన్‌ను ఏర్పాటు చేసిన జిన్నా, లియాకత్ అలీ ఖాన్‌ల మనసులు, ఆలోచనలు అప్పటికే మారిపోయాయి.

పాత ఒప్పందాలను గాలికొదిలేసి పాకిస్తాన్ కొత్త షరట్లను తెరపైకి తెచ్చింది. కలాత్‌కు సంబంధించి రక్షణ, విదేశీ వ్యవహారాలు, కమ్యూనికేషన్స్ వంటి కీలక నిర్ణయాలన్నీ తామే తీసుకుంటామని పాకిస్తాన్ పేర్కొంది. దీనిపై ఏమైనా వివాదాలు వస్తే కరాచీలో చర్చలు జరుపుతామని తేల్చిచెప్పింది. ఇక్కడి నుంచే అసలు సమస్యలు మొదలయ్యాయి. బలూచిస్తాన్ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఇదంతా బ్రిటిష్ వారి కుట్ర వల్లే జరిగింది. కలాత్‌ను కనుక స్వతంత్రంగా వదిలేస్తే అది భారత్‌కు దగ్గరవుతుందని, అది పాకిస్తాన్ ప్రయోజనాలకు విఘాతమని వారు భావించారు. ఈ అంశంపై అప్పట్లో బలూచిస్తాన్ నాయకుడు గౌస్ బిజెన్జో మాట్లాడుతూ ఒక కీలకమైన మాట చెప్పారు. పాకిస్తాన్ ఆర్థికంగా తనంతట తానుగా నిలదొక్కుకోలేదని, తమ వద్ద పెట్రోలియం, ఖనిజాలు, రేవు ప్రాంతాలు ఉన్నందువల్లే వారు తమపై నియంత్రణ సాధించాలని చూస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. అసలు బలూచిస్తాన్ లేకుండా పాకిస్తాన్ ఎక్కడ ఉండేదని ఆయన ప్రశ్నించారు.

బలూచిస్తాన్‌ను తన గుప్పిట్లోకి తెచ్చుకోవడానికి మహమ్మద్ అలీ జిన్నా ఎంతో తెలివిగా ఒక వ్యూహాన్ని అమలు చేశారు. బలూచిస్తాన్‌లోని అతిపెద్ద ప్రాంతంపై ఆధిపత్యం చెలాయించడానికి ముందే, ఆయన చాలా వ్యూహాత్మకంగా ఖారన్, లాస్‌బెలా, మక్రన్ వంటి చిన్న ప్రాంతాలను నెమ్మదిగా పాకిస్తాన్‌లో కలిపేశారు. ఆ తర్వాత 1948 మార్చిలో కలాత్‌పై సైనిక చర్య చేపడతామని బెదిరించి దానిని తన నియంత్రణలోకి తెచ్చుకునే ప్రయత్నం చేశారు. చివరికి పరిస్థితులు చేయి దాటిపోవడాన్ని గమనించిన కలాత్ ఖాన్, 1948 మార్చి 30న పాకిస్తాన్‌తో ఒప్పందం కుదుర్చుకోవాల్సి వచ్చింది.

అయితే బలూచ్ ప్రజలు మాత్రం ఈ విలీనాన్ని ఎప్పుడూ అంగీకరించలేదు. తమ చరిత్ర 3,500 ఏళ్ల పురాతనమైనదని, తమ చరిత్రలో ఎవరూ ఇంతటి ద్రోహం చేయలేదని బలూచ్ విద్రోహులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒప్పందం కుదిరిన మొదటి రోజే పాకిస్తాన్ తన నిజస్వరూపాన్ని బయటపెట్టింది. కలాత్‌కు ఎలాంటి స్వతంత్ర సార్వభౌమాధికారం ఉండదని పాకిస్తాన్ ప్రకటించింది. ఒకప్పుడు బ్రిటిష్ వారికి కలాత్ మీద ఏవిధమైన అధికారాలు ఉండేవని ఇప్పుడు అవే అధికారాలు పాకిస్తాన్‌కు ఉంటాయని స్పష్టం చేసింది. ఈ విధంగా బలూచిస్తాన్‌లో అత్యంత కీలకమైన భాగమైన కలాత్ పాకిస్తానీలో కలిసిపోయింది.

Also Read : భారీ భూకంపం…రిక్టర్‌ స్కేల్‌పై 7.4 గా నమోదు..వణికిన 3 దేశాలు 

బలూచిస్తాన్ చరిత్ర అక్కడి జనాభా కంటే కూడా దాని భౌగోళిక స్థానమే పాకిస్తాన్‌కు అత్యంత కీలకం. ఒక వైపు సుదీర్ఘమైన సముద్ర తీరం, మరోవైపు భూగర్భంలో అపారమైన ఖనిజ సంపద ఈ ప్రాంతం సొంతం. పాకిస్తాన్ మొత్తం జనాభాలో కేవలం 5 శాతం మంది మాత్రమే ఇక్కడ నివసిస్తున్నారు కానీ పాకిస్తాన్ మొత్తం భూభాగంలో బలూచిస్తాన్ ఏకంగా 44 శాతం విస్తీర్ణాన్ని కలిగి ఉంది. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్‌లతో ఈ ప్రాంతానికి నేరుగా సరిహద్దులు ఉన్నాయి. ఇక్కడి నుంచే నేరుగా ఇరాన్, మిడిల్ ఈస్ట్ దేశాలకు భూమార్గం కలుస్తుంది. పాకిస్తాన్, చైనా కలిసి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న గ్వాదర్ పోర్టు కూడా ఇక్కడే ఉంది. ఇది పాకిస్తాన్‌తో పాటు చైనాకు కూడా చాలా ముఖ్యమైనది. దీన్ని బట్టి చూస్తే పాకిస్తాన్ కేవలం తన స్వార్థం కోసం, అక్కడి సహజ వనరులను దోచుకోవడం కోసమే మొదటి నుంచి బలూచిస్తాన్‌ను తనలో కలిపేసుకుందనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.