మెడలో లావుపాటి గొలుసులు, చేతులకు నిండా ఉంగరాలు, కాళ్లకు బంగారు కడియాలు.. చూస్తే అపర కుబేరుడిలా బిల్డప్ ఇవ్వడం ఈ మధ్య కాలంలో ఒక ఫ్యాషన్‌గా మారింది. సామాన్యులు ఒక్క గ్రాము నిజమైన బంగారం కొనడానికే వంద లెక్కలు వేసుకుంటుంటే, వీరు కిలోల కొద్దీ బంగారాన్ని ఎలా ధరిస్తున్నారనే సందేహం అందరిలోనూ తలెత్తింది. అయితే, ఇటీవల రంగంలోకి దిగిన ఆదాయపు పన్నుశాఖ (ఐటీ) అధికారులు వీరి ఆభరణాలను నిశితంగా పరిశీలించగా.. అవన్నీ ‘వన్‌గ్రామ్‌ గోల్డ్‌’ (గిల్ట్ నగలు) అని తేలడంతో వీరి అసలు బండారం బయటపడింది.
హైదరాబాద్ రాజధాని నగరంలో ఇలాంటి ‘బంగార్రాజులు’ ప్రస్తుతం పదుల సంఖ్యలో తిరుగుతున్నారు. వీరు కేవలం రోడ్లపైనే కాకుండా యూట్యూబ్‌ ఇంటర్వ్యూలు, ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌తో సామాజిక మాధ్యమాల్లో నానా హంగామా సృష్టిస్తున్నారు. ఇదంతా నిజమైన బంగారమేనని నమ్ముతున్న అమాయక ప్రజలు, ఈ ‘పసిడిబాబులు’ ఎక్కడ కనిపించినా వారితో సెల్ఫీల కోసం ఎగబడుతూ వారికి విపరీతమైన క్రేజ్ తెచ్చిపెడుతున్నారు.

ఈ బంగారు బాబులకు బంధుమిత్రుల్లోనూ, సోషల్ మీడియాలోనూ విపరీతమైన ఆదరణ లభిస్తోంది. వీరు ఎక్కడికి వెళ్లినా అభిమానులు వెంటపడటం, పండగలు, ఉత్సవాలు, వివాహ శుభకార్యాల్లో వీరికి ప్రత్యేక ఆహ్వానితులుగా గౌరవం దక్కడం విశేషం. నాలుగైదేళ్ల క్రితం ఇలాంటి వారు ఒకరిద్దరే ఉండగా, ఇప్పుడు వారి సంఖ్య 15 నుండి 20 కి చేరింది. సామాజిక మాధ్యమాల్లో పహిల్వాన్, భాయ్, గోల్డ్‌బాయ్, రాక్స్‌ అనే పేర్లతో వీరికి లక్షల్లో ఫాలోవర్లు ఉన్నారు.

Also Read : రైతు భరోసా.. కొత్త రైతులకు గ్రీన్‌ సిగ్నల్‌.. ఈ నెల 30న పెట్టుబడి సాయం!

అయితే, ఈ దర్పం వెనుక ఉన్న అసలు నిజాలు చాలా దారుణంగా ఉన్నాయి. ఉదాహరణకు పాతబస్తీకి చెందిన ముగ్గురు ప్రముఖ బంగార్రాజుల్లో కేవలం ఒక్కరు మాత్రమే అసలైన బంగారు ఆభరణాలు ధరిస్తున్నారని సమాచారం. మిగిలిన ఇద్దరు కేవలం గిల్ట్ నగలతో సమాజంలో దర్పం ప్రదర్శిస్తూ, ఆ ఆర్భాటం కోసం పెద్దఎత్తున అప్పులు చేసి అప్పుల ఊబిలో కూరుకుపోయినట్లు ప్రచారం జరుగుతోంది.

 ఈ కిలో బంగారు బాబులు చెప్పే అబద్ధాలు కూడా వినడానికి చాలా విడ్డూరంగా ఉంటాయి. “మా తాతలు ఎన్నో ఎకరాలు సంపాదించారు, ఎన్నో దానధర్మాలు చేశారు.. ఆ పేరు నిలబెట్టడానికే నేను ఇలా తిరుగుతున్నా” అని ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో 25 ఏళ్ల కుర్రాడు గొప్పలు చెప్పుకొచ్చాడు. తీర పోలీసులు ఆరా తీస్తే, అతనికి ఊళ్లో సొంత పొలం కూడా లేదని, ఒక ప్రైవేటు కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తూ కేవలం బంగారంలా మెరిసే గొలుసులతో హల్చల్ చేస్తున్నాడని తేలింది.

ఇలాంటి ఆర్భాటాల వెనుక వింత వింత కారణాలు కూడా పోలీసుల విచారణలో వెలుగు చూస్తున్నాయి. ఇటువంటి ముగ్గురు వ్యక్తులపై ఫిర్యాదులు రావడంతో పోలీసులు ఒక యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. పెళ్లి సంబంధాల సమయంలో తనకు ఎక్కువ కట్నం వస్తుందనే దురాశతోనే, సమాజంలో గొప్పగా చూపించుకోవడానికి ‘వన్‌గ్రామ్‌ గోల్డ్‌’ నగలను ప్రత్యేకంగా తయారు చేయించుకుని తిరుగుతున్నట్లు సదరు యువకుడు పోలీసు ఇన్‌స్పెక్టర్‌ ఎదుట ఒప్పుకున్నాడు.

దురదృష్టవశాత్తూ, ఈ క్రేజ్‌ను కొందరు కేటుగాళ్లు మోసాలకు పెట్టుబడిగా మార్చుకుంటున్నారు. స్థానికులు గుర్తుపడతారనే భయంతో ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి మకాం మారుస్తూ, సెకండహ్యాండ్‌ లగ్జరీ కార్లతో హంగామా చేస్తున్నారు. సేవాకార్యక్రమాల పేరిట నటిస్తూ.. దంపతుల మధ్య కలహాలను, భూ వివాదాలను పరిష్కరిస్తామంటూ రంగంలోకి దిగుతున్నారు. చివరికి దుబాయి నుండి వచ్చే స్మగ్లింగ్ బంగారాన్ని తక్కువ ధరకే ఇప్పిస్తామంటూ అమాయకులను నమ్మించి నట్టేట ముంచుతున్నారు.

ఇలాంటి కోవలోనే ‘గోల్డ్‌మ్యాన్’ అని పిలవబడే ఒక కేటుగాడు ఏకంగా కోటి రూపాయలకే కిలో బంగారం ఇస్తానంటూ భారీ మోసానికి తెరలేపాడు. “నేనెవరో మీకు తెలుసు కదా.. నేను గోల్డ్‌మ్యాన్‌ను, బంగారం వ్యాపారం చేస్తుంటా.. అంతా ఫారిన్‌ నుంచే తెప్పిస్తా” అంటూ మాయమాటలు చెప్పే అత్తాపూర్‌కు చెందిన సూర్యకుమార్‌ అలియాస్‌ సూర్యాభాయ్‌ అలియాస్‌ గోల్డ్‌మ్యాన్‌పై తాజాగా పోలీసు కేసు నమోదైంది.

నారాయణగూడ ఇన్‌స్పెక్టర్‌ సైదేశ్వర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. హయత్‌నగర్‌కు చెందిన స్వర్ణకారుడు కృష్ణాచారికి ఈ గోల్డ్‌మ్యాన్ తన డ్రైవర్‌ ద్వారా పరిచయమయ్యాడు. హిమాయత్‌నగర్‌లోని ఒక కేఫేలో వీరిద్దరి మధ్య డీల్ కుదరగా, బాధితుడు కృష్ణాచారి రూ.32.30 లక్షల నగదును గోల్డ్‌మ్యాన్‌కు అందజేశాడు. ఆ తర్వాత బంగారం ఇవ్వకుండా తిప్పించుకోవడంతో, బాధితుడు తన స్నేహితుడు నవీన్‌సింగ్‌తో కలిసి గోల్డ్‌మ్యాన్‌ ఇంటికి వెళ్లి నిలదీయగా.. సూర్యాభాయ్ వారికి 3 ఐఫోన్లు, రూ.20 లక్షల చెక్కులిచ్చి పంపించేశాడు.

ఆ తర్వాత సీన్ రివర్స్ చేస్తూ జూన్‌ 25న నవీన్‌సింగ్, కృష్ణాచారి తన ఇంటికి వచ్చి గొడవ చేసి ఫోన్లు, బంగారం ఎత్తుకెళ్లారని గోల్డ్‌మ్యాన్ అత్తాపూర్‌ ఠాణాలో రివర్స్ ఫిర్యాదు చేశాడు. దీనిపై అత్తాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వరరావు సదరు వ్యక్తులను పిలిపించి లోతుగా విచారించడంతో గోల్డ్‌మ్యాన్ చేసిన అసలు మోసం బట్టబయలైంది. దీంతో కృష్ణాచారి ఇచ్చిన ఫిర్యాదుపై అత్తాపూర్‌ పోలీసులు మొదట ‘జీరో’ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, తదుపరి విచారణ నిమిత్తం కేసును నారాయణగూడ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. అనంతరం గోల్డ్ మ్యాన్ సూర్య భాయ్‌ను అరెస్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి షాద్‌నగర్‌ పారిపోతుండగా పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. సూర్యభాయ్‌ అసలు రంగు బయటపడటంతో పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Also Read : ప్రభుత్వానికి షాక్‌… ఫీజు రియింబర్స్‌మెంట్‌ పై హైకోర్టు సంచలన కామెంట్స్‌

MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.