Mumbai :  ముంబైలో జరిగిన గణేశ్ ఉత్సవ వేడుకల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గణపతి విగ్రహాన్ని తీసుకొచ్చే సమయంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, ఇద్దరు పిల్లలతో సహా ఐదుగురు గాయపడ్డారు. శనివారం రాత్రి ముంబైలోని భులేశ్వర్ ప్రాంతంలోని జయ అంబే చౌక్ వద్ద భులేశ్వరాచా రాజా విగ్రహాన్ని తీసుకొచ్చే వేడుకల్లో భక్తులు భారీగా గుమిగూడారు. రాత్రి 10 గంటల సమయంలో విగ్రహాన్ని తీసుకువెళ్తున్న నిర్మాణం ఒక్కసారిగా కుప్పకూలడంతో జనాల మీద పడింది.

ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, ముంబై పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు.

మృతి చెందిన వారిని 33 ఏళ్ల సంకేత్ నెవ్షే, 30 ఏళ్ల బ్రిజేష్ హేమంత్ జోషిగా గుర్తించారు. గాయపడిన ఐదుగురిలో 38 ఏళ్ల వైభవ్ ఘెనాంద్, 25 ఏళ్ల పవన్ చౌరాసియా, 26 ఏళ్ల కునాల్ కాషిద్‌తో పాటు 5 ఏళ్ల లావణ్య గణేర్, 7 ఏళ్ల దివ్య గణేర్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం గాయపడిన వారందరి ఆరోగ్యం నిలకడగా ఉందని అధికారులు తెలిపారు.

మహారాష్ట్రలో ప్రతిష్టాత్మకంగా జరిగే 10 రోజుల గణేశోత్సవాలకు ముంబై ముస్తాబవుతున్న తరుణంలో ఈ ఘటన జరగడం తీవ్ర కలకలం రేపింది. ఈ వేడుకల్లో భాగంగా భక్తులు గణపతి విగ్రహాలను ఊరేగింపుగా పండల్స్‌కు తీసుకువస్తుంటారు. అయితే భులేశ్వర్‌లో జరిగిన ఈ ప్రమాదం భారీ జనసమ్మర్దం ఉండే వేడుకల్లో భద్రతా ఏర్పాట్లపై ఆందోళనలను రేకెత్తిస్తోంది. విగ్రహం కూలడానికి అసలు కారణం ఏమిటనే దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.