Mohanlal : మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఈ రోజు జరగాల్సిన ఆయన లైవ్ షో చివరి నిమిషంలో వాయిదా పడింది. మోహన్‌లాల్‌కు సకాలంలో ఆస్ట్రేలియా వీసా రాకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. సిడ్నీలోని నార్త్‌వెస్ట్ కన్వెన్షన్ సెంటర్‌లో భారీ వేడుకను నిర్వహించాల్సి ఉంది. ఈ కార్యక్రమంలో మోహన్‌లాల్‌తో పాటు పలువురు సినీ రంగానికి చెందిన కళాకారులు పాల్గొనాల్సింది.

Also Read : విశ్వనాథ్ అండ్‌ సన్స్‌ ట్రైలర్ రిలీజ్.. అదిరిపోయింది అంతే!

దీనిపై మోహన్ లాల్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. నా టీమ్ లోని చాలా మంది సభ్యులు ఇప్పటికే సిడ్నీ చేరుకున్నారు. కానీ వీసా రాకపోవడంతో నేను వారితో కలవలేకపోయాను. ఇది ఎలా జరిగిందో నాకేమీ అర్థం కావడం లేదు. బహుశా ఏదైనా టెక్నికల్ లోపం జరిగి ఉండవచ్చు. దీనికి నేనే బాధ్యత వహిస్తున్నాను అని చెప్తూ, షో రద్దయినందుకు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న కాయల్ ఈవెంట్స్ సంస్థ కూడా వీసా ఆమోదంలో వచ్చిన అనూహ్య జాప్యం వల్లే షోను వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. షోలోని ఇతర కళాకారులు, సాంకేతిక బృందం ఇప్పటికే సిడ్నీకి చేరుకున్నప్పటికీ, మోహన్‌లాల్ రావాల్సి ఉండటంతో కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లలేకపోయామని తెలిపారు. త్వరలోనే ఈ షో కొత్త తేదీలను వెల్లడిస్తామని నిర్వహకులు స్పష్టం చేశారు.

నాలుగు దశాబ్దాలకు పైగా సినీ ప్రస్థానంలో పద్మభూషణ్, పలు జాతీయ అవార్డులు అందుకున్న మోహన్‌లాల్, మలయాళంతో పాటు తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో 350కి పైగా చిత్రాల్లో నటించి ఇండియాలో అగ్రనటుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు.

Also Read : అనవసరమైన కామెంట్లు ఆపండి… హృతిక్ రోషన్‌కు కంగన వార్నింగ్!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.