JPSC Paper Leak : ఒకవైపు విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతుండగానే జార్ఖండ్ లో బిగ్‌ ట్విస్ట్‌ నెలకొంది. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC) మాజీ ఛైర్మన్ ఎల్.ఖియాంగ్టేను ఆ రాష్ట్ర సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన విద్యార్థులు భారీగా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఎల్.ఖియాంగ్టేను అరెస్ట్‌ చేయడం సంచలనంగా మారింది. అనంతరం ఆయనను జేపీఎస్‌సీ 14వ కంబైన్డ్ సివిల్ సర్వీసెస్ పరీక్షకు సంబంధించి పలు కీలక ప్రశ్నలు సంధించారు. బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న టీడీపీఎల్ (TDPL) కంపెనీని జేపీఎస్‌సీ 14వ పరీక్ష నిర్వహణకు ఎందుకు ఎంపిక చేశారని సీఐడీ అధికారులు ఖియాంగ్టేను ప్రశ్నించారు. అలాగే ఈ కేసుకు సంబంధించి మరికొన్ని కీలక అంశాలపై ఆయనను సీఐడీ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

Also Read : దిగుమతి టారిఫ్‌ పెంపుదల.. బంగారం, వెండితో ₹10వేల కోట్లు రాబడి

ఇదే కేసులో జేపీఎస్‌సీ మాజీ ఛైర్మన్‌ను సీఐడీ అధికారులు పలుమార్లు విచారించారు. తాజాగా ఆయనను అరెస్టు చేయడం గమనార్హం. కాగా, జార్ఖండ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేసిన ఖియాంగ్టే.. 2026 జులై 22న జేపీఎస్‌సీ ఛైర్మన్ పదవికి రాజీనామా చేసిని విషయం తెలిసిందే. పేపర్‌ లీక్‌కు సంబంధించి నిష్పక్షపాతంగా విచారణ జరిగేలా చూడటానికే తాను రాజీనామా చేసినట్లు అప్పట్లో ఆయన ప్రకటించారు. మరోవైపు, జేపీఎస్‌సీ, జేఎస్‌ఎస్‌సీ నియామక పరీక్షల ప్రక్రియలో జరిగిన అవకతవకలు, ఓఎంఆర్ షీట్ల లీకేజీలను వ్యతిరేకిస్తూ విద్యార్థులు గడచిన17 రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే సోమవారం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో జార్ఖండ్‌లో విద్యార్థులు, ఆయా పరీక్షలకు హాజరైన అభ్యర్థులు పెద్దఎత్తున ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది.

ఈ సందర్భంగా పరీక్షల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం, స్వతంత్రంగా విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు భారీర్యాలీ నిర్వహించారు. రాంచీలోని అసెంబ్లీ వైపు వేలాది మంది విద్యార్థులు దూసుకెళ్లడంతో వారిని అడ్డుకునేందుకు పోలీసులు వాటర్ కెనన్లు ప్రయోగించాల్సి వచ్చింది. అయినా విద్యార్థులు వెనకకు తగ్గకపోవడంతో లాఠీఛార్జ్ చేయడంతో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. రాంచీలో ఆందోళనలు కొనసాగుతుండగానే హజారీబాగ్, ధన్‌బాద్, బొకారో తదితర జిల్లాల్లోనూ విద్యార్థులు వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలపడం గమనార్హం.

Also Read : అయోధ్య రామమందిరానికి కొత్త CEO.. రేసులో 18 మంది!

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.