
Lal Darwaza Bonalu 2026: చారిత్రక హైదరాబాద్ నగరంలో అత్యంత వైభవంగా జరిగే ఆషాఢమాస బోనాల జాతర అత్యంత వైభవంగా జరుగుతోంది. నేటితో బోనాల పండుగ వేడుకలు తుది దశకు చేరుకున్నాయి. గత నెల 16న గోల్కొండ బోనాలతో ప్రారంభమైన బోనాల ఉత్సవాలు ఈరోజు ఆదివారం జరిగే పాతబస్తీ (ఓల్డ్ సిటీ) లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరతో మరింత తారాస్థాయికి చేరుకున్నాయి.ఈ రోజు తెల్లవారుజాము నుంచే ప్రసిద్ధ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. అమ్మవారికి తొలి బోనాన్ని సమర్పించేందుకు భక్తులు ఉదయం నుంచే పోటెత్తారు. సామాన్య ప్రజానీకంతో పాటు రాజకీయ, సినీ ప్రముఖులు సైతం అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.
నెలరోజులుగా సాగుతున్న బోనాల జాతర చివరి అంకానికి చేరుకుంది. ఈరోజు నగర వ్యాప్తంగా ఉన్న అన్ని దేవాలయాల్లో బోనాల పండుగ అత్యంత వైభవంగా జరగనుంది. ఈ నేపథ్యంలో వేడుకలను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అధికారిక సెలవు దినంగా ప్రకటించింది. ఈ రోజు తెల్లవారుజామునే లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారికి బలిహరణం, దేవీ అభిషేకం నిర్వహించారు. అనంతరం బోనాల సమర్పణను ప్రారంభించారు. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండడంతో ఆలయం వద్ద ప్రత్యేక క్యూలైన్లు, బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈ ఏడాది లాల్ దర్వాజా బోనాలకు దాదాపు ఐదు లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.
బోనాల పండుగ సందర్భంగా పాతబస్తీలోని లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారితో పాటు, చార్మినార్ భాగ్యలక్ష్మిహరిబౌలి అక్కన్న మాదన్న, రాంబక్షిబండ మైసమ్మ, ముత్యాలమ్మ, కోవబేటా బంగారు మైసమ్మ, ఉప్పుగూడ మహంకాళి మాత తదితర ప్రముఖ ఆలయాలన్నీ విద్యుత్ కాంతులతో, ప్రత్యేక అలంకరణలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఉత్సవాల్లో భాగంగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార పార్టీ నాయకులు ప్రభుత్వ ప్రతినిధులుగా అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు. ఉప్పుగూడ శ్రీ మహంకాళి అమ్మవారికి శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మీరాలం మండి అమ్మవారికి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే లాల్దర్వాజ సింహవాహిని అమ్మవారికి మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ; హరిబౌలి అక్కన్న మాదన్న అమ్మవారికి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు; కార్వాన్ దర్బార్ మైసమ్మకు మంత్రి దామోదర రాజనర్సింహ తదితరులు ప్రభుత్వ లాంఛనాలతో పట్టు వస్త్రాలు సమర్పించారు. సోమవారం రోజున రంగం, బలిగంప వేడుకలతో పాటు ఉమ్మడి దేవాలయాల ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో తొట్టెల, ఫలహారపు బండ్ల అట్టహాసంగా ఊరేగింపు నిర్వహిస్తామని ఆలయ కమిటీ నిర్వహకులు తెలిపారు. ఈ నెల 13న గోల్కొండ కోటలో జగదాంబిక మహంకాళి అమ్మవారికి 9వ పూజతో ఈ ఏడాది ఆషాఢ బోనాల ఉత్సవాలు అధికారికంగా ముగుస్తాయి.
హీరో విజయ్ దేవరకొండ:
కాగా, ఉత్సవాలలో భాగంగా లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతరలో హీరో విజయ్ దేవరకొండ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన విజయ్ దేవరకొండ, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకోవడం విశేషం. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు తమ్ముడు ఆనంద్ దేవరకొండ, ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కూడా ఉన్నారు.









