
Ram Janmabhoomi Trust : అయోధ్యలోని రామ్ మందిర నిర్మాణ విరాళాల దొంగతనంపై ఇటీవల తలెత్తిన వివాదాల నేపథ్యంలో, ఆలయ సముదాయాన్ని నిర్వహించే శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ (SRJBTK) పనితీరు, దాని జవాబుదారీతనంపై చర్చ మొదలైంది. ఈ ట్రస్ట్ కేంద్ర లేదా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాల నియంత్రణలో గానీ, వాటికి జవాబుదారీగా గానీ ఉండదని జూలై 3 నాటి ఒక నివేదిక స్పష్టం చేసింది. పార్లమెంటు చట్టం ద్వారా కాకుండా, సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా ఈ ట్రస్ట్ ఏర్పాటవడమే దీనికి ప్రధాన కారణం.
ట్రస్ట్ హోదాపై సమాచార కమిషన్ (CIC) ఆదేశాలు
ట్రస్ట్ హోదాకు సంబంధించి 2025 జూన్ 6న కేంద్ర సమాచార కమిషన్ (CIC) ‘నీరజ్ శర్మ వర్సెస్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్’ కేసులో కీలక ఆదేశాలు జారీ చేసింది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అనేది ఒక స్వతంత్ర సంస్థ అని సీఐసీ స్పష్టం చేసింది. ఈ ట్రస్ట్కు ప్రభుత్వంతో ఎలాంటి యాజమాన్య, నియంత్రణ లేదా ఆర్థిక సంబంధాలు లేవు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ట్రస్ట్కు ఎలాంటి నిధులను కూడా విడుదల చేయవు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ట్రస్ట్ను ఏర్పాటు చేయడం మాత్రమే ప్రభుత్వ పాత్ర అని, ఆ తర్వాత అందులో ప్రభుత్వానికి ఎలాంటి పరిపాలనాపరమైన లేదా ఆర్థికపరమైన భాగస్వామ్యం లేదని సీఐసీ పేర్కొంది. ప్రభుత్వ ఆర్థిక మద్దతు గానీ, పరిపాలనా నియంత్రణ గానీ లేనందున ఈ ట్రస్ట్ సమాచార హక్కు చట్టం (RTI Act), 2005 పరిధిలోకి రాదని స్పష్టం చేసింది.
ప్రభుత్వ అధికారులకు ఓటు హక్కు లేదు
ఈ ట్రస్ట్ ఒక ‘ట్రస్ట్ డీడ్’ (లిఖితపూర్వక పత్రం) ద్వారా ఏర్పడిందని, ప్రభుత్వ నోటిఫికేషన్ ద్వారా కాదని సీఐసీ విచారణలో లాయర్లు వివరించారు. సేకరించిన భూమిపై సర్వ హక్కులు ఆ ట్రస్ట్కే చెందుతాయని ప్రభుత్వ నోటిఫికేషనే స్పష్టం చేసింది. అంతేకాకుండా, ట్రస్ట్ సమావేశాలలో ప్రభుత్వ ప్రతినిధులకు లేదా డిస్ట్రిక్ట్ కలెక్టర్కు ఎలాంటి ఓటు హక్కు ఉండదు.
సుప్రీంకోర్టు అయోధ్య తీర్పునకు అనుగుణంగా ఎలాంటి ఆర్థిక, పరిపాలనాపరమైన జోక్యం లేని విధంగా ఈ ట్రస్ట్ నిర్మాణాన్ని కేంద్ర హోం శాఖ (MHA) రూపొందించింది. ఈ ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం కేవలం “సెట్లర్” (Settler – ట్రస్ట్ను ప్రారంభించిన వ్యవస్థాపకుడు) పాత్ర మాత్రమే పోషించింది. ట్రస్ట్ నిబంధనల ప్రకారం, ట్రస్ట్ ఏర్పాటైన తర్వాత దాని దైనందిన విధుల్లో సెట్లర్కు ఎలాంటి ప్రత్యక్ష పాత్ర ఉండదు. బాడీ ఏర్పడటంతోనే సెట్లర్ పాత్ర ముగుస్తుంది.
ట్రస్ట్ ఎవరికి జవాబుదారీ?
ప్రభుత్వానికి కాకపోతే, ఈ ట్రస్ట్ మరెవరికి జవాబుదారీ అనే ప్రశ్న తలెత్తుతుంది. భారతీయ ట్రస్ట్ల చట్టం (Indian Trusts Act) – సెక్షన్ 3 ప్రకారం, ఒక వ్యక్తి మరొకరి ప్రయోజనం (Benefit) కోసం ఆస్తిని నిర్వహించే చట్టపరమైన ఏర్పాటే ట్రస్ట్. ఇందులో ట్రస్ట్ను సృష్టించే వ్యక్తిని ‘ఆథర్’, ఆస్తిని నిర్వహించే వారిని ‘ట్రస్టీ’, దాని ద్వారా ప్రయోజనం పొందే వారిని ‘బెనిఫిషియరీ’ (లబ్ధిదారుడు) అంటారు.
భారతీయ ట్రస్ట్ల చట్టంలోని సెక్షన్ 57 ప్రకారం, ట్రస్ట్ ఎలా నిర్వహించబడుతుందో తెలుసుకునే హక్కు బెనిఫిషియరీలకు ఉంటుంది. వారు ట్రస్ట్ డీడ్, ఆర్థిక ఖాతాలు, బిల్లులు, వోచర్లు, లీగల్ ఒపీనియన్లను కూడా తనిఖీ చేయవచ్చు. అంటే చట్ట ప్రకారం ట్రస్టీలు బెనిఫిషియరీలకే జవాబుదారీగా ఉంటారు.
శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్కు సంబంధించిన ‘ట్రస్ట్ డీడ్’ ప్రస్తుతం బహిరంగంగా అందుబాటులో లేదు. అయినప్పటికీ, సంప్రదాయం ప్రకారం ఇలాంటి ఆలయ ట్రస్ట్లలో ఆ ఆలయ అధిష్టాన దైవమే (Deity) ప్రధాన బెనిఫిషియరీగా పరిగణించబడుతుంది. అందువల్ల, ఈ చట్టపరమైన సాంప్రదాయాల ప్రకారం ట్రస్టీలందరూ ఆ రామయ్యకే జవాబుదారీగా ఉంటారు.









